లోడుతో ఉన్న లారీ వచ్చి మీద పడింది.. నలిగిపోయిన బొలేరో.. డ్రైవర్ దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఆదివారం జరిగిన ఒక భయానక ప్రమాదంలో ఓవర్‌లోడెడ్ లారీ అదుపుతప్పి పక్కనే వెళ్తున్న బొలేరో కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నలిగిపోగా, డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారును చిదిమేసిన ఈ దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.

Published on: Dec 29, 2025, 15:12:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, ఓవర్‌లోడింగ్ కారణంగా ఒక లారీ నిండు ప్రాణాన్ని బలిగొన్న తీరు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాంపూర్ జిల్లా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహాడీ గేట్ సమీపంలో ఆదివారం ఈ విషాదం జరిగింది.

లోడుతో ఉన్న లారీ వచ్చి మీద పడింది.. నలిగిపోయిన బొలేరో.. డ్రైవర్ దుర్మరణం (HT Photos )
లోడుతో ఉన్న లారీ వచ్చి మీద పడింది.. నలిగిపోయిన బొలేరో.. డ్రైవర్ దుర్మరణం (HT Photos )

నిమిషాల్లోనే చితికిపోయిన కారు

వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. పొట్టు (Husk) లోడుతో వెళ్తున్న ఒక ఓవర్‌లోడెడ్ లారీ పహాడీ గేట్ వద్ద రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ ఒక్కసారిగా అదుపుతప్పి, పక్కనే వెళ్తున్న బొలేరో కారుపై బోల్తా పడింది. లారీ బరువుకు కారు అప్పడంలా నలిగిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఫిరాసత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక నివాసిగా పోలీసులు గుర్తించారు.

బయటపడ్డ భయానక దృశ్యాలు

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లారీ బోల్తా పడిన వెంటనే అందులోని పొట్టు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. ప్రమాదానికి గురైన బొలేరో కారుపై "ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం" అని రాసి ఉండటం గమనార్హం. అయితే ఆ కారు అధికారికంగా ప్రభుత్వానికి చెందినదా కాదా అనే అంశంపై పోలీసులు ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

సహాయక చర్యలు, పోలీసుల వివరణ

ప్రమాద సమాచారం అందిన వెంటనే గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జెసిబీ, క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించి, నుజ్జునుజ్జయిన కారులో నుంచి ఫిరాసత్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా స్పందిస్తూ.. "ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కారులో డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. లారీ కింద మరెవరూ చిక్కుకోలేదని నిర్ధారించుకున్నాం. ప్రస్తుతం ట్రాఫిక్‌ను పునరుద్ధరించాం, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి" అని తెలిపారు.

నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, పరిమితికి మించి లోడును రవాణా చేయడం ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More