Mahindra SUVs : ఒకటి కాదు, రెండు కాదు.. మహీంద్రా నుంచి ఒకేసారి ఏకంగా 3 కార్లు?
Upcoming Mahindra SUVs India : ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరికొత్త కార్లను పరిచయం చేసే సాంప్రదాయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఈసారి కూడా కొనసాగించనుంది. ఈసారి మూడు రోజుల మెగా ఈవెంట్లో 3 కార్లను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు..
ప్రతీ యేటా ఆగస్ట్ 15న, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తన కొత్త ప్రాడక్ట్లను ప్రదర్శించడం ఆనవాయతీగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తన ప్రాడక్ట్స్తో రెడీ అవుతోంది. అయితే ఈసారి ఏకంగా మూడు రోజుల పాటు భారీ ఈవెంట్ను ప్లాన్ సంస్థ ప్లాన్ చేయడం విశేషం. ఈ వేదికపై పలు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవ్వడంతో పాటు, భవిష్యత్తు మోడళ్లు తొలిసారి కస్టమర్ల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది!

రాబోయే మహీంద్రా మోడళ్లకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆగస్టు 15 ఈవెంట్లో మనం ఏయే కార్లను ఆశించవచ్చో ఇప్పుడు చూద్దాము..
1. మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్..
మహీంద్రా మార్కెట్లోకి తీసుకురానున్న సరికొత్త స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్ మోడల్ వచ్చే నెలలోనే అధికారికంగా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ పాపులర్ ఎస్యూవీ బాహ్య డిజైన్, లోపలి ఫీచర్లలో కంపెనీ కొన్ని కీలకమైన మార్పులు చేస్తోంది. అయితే ఇంజిన్ పరంగా ప్రస్తుతం ఉన్న పవర్ఫుల్ 2.2 లీటర్ టర్బో డీజిల్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లనే ఇందులోనూ కొనసాగించనున్నారు. ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తూ దొరికిన స్పై చిత్రాల ప్రకారం.. ఈ 2026 స్కార్పియో ఎన్ సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీ-డిజైన్ చేసిన హెడ్ల్యాంప్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్తో రానుంది. కారు సైడ్ ప్రొఫైల్ పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, సరికొత్త డిజైన్తో కూడిన పెద్ద అలాయ్ వీల్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
క్యాబిన్ లోపల కస్టమర్ల కోసం పెద్ద 10.25-ఇంచుల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సరికొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అందమైన పనోరమిక్ సన్రూఫ్లను మహీంద్రా జోడించనుంది. వీటన్నింటితో పాటు, భద్రతను మరింత పెంచే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఫీచర్ను ఈసారి తక్కువ ధర వేరియంట్లలో కూడా అందుబాటులోకి తెచ్చేలా మహీంద్రా ప్లాన్ చేస్తోంది.
2. ప్రొడక్షన్-రెడీ మహీంద్రా విజన్ ఎస్..
మహీంద్రా విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న సబ్-4 మీటర్ (4 మీటర్ల లోపు పొడవుండే) ఎస్యూవీ ప్రొడక్షన్-రెడీ (మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న) వెర్షన్ను ఆగస్టు 15న ఆవిష్కరించే అవకాశం ఉంది. మహీంద్రా సరికొత్తగా డెవలప్ చేసిన 'NU_IQ' ఆర్కిటెక్చర్పై రూపొందుతున్న మొట్టమొదటి మోడల్ ఇదే కావడం విశేషం. ఈ కారు తుది రూపం దాదాపు కాన్సెప్ట్ మోడల్ను పోలి, మంచి ఎత్తుతో బాక్సీ స్టాన్స్ను కలిగి ఉంటుంది. అయితే, కాన్సెప్ట్ కారులో చూపించిన బోనెట్ ఇంటిగ్రేటెడ్ లింబ్ రైజర్స్, రూఫ్-మౌంటెడ్ లైట్లు, వెనుక వైపు ఉండే స్టెప్లాడర్, జెర్రీ కాన్ వంటి ఆఫ్-రోడ్ ఎలిమెంట్లను సాధారణ వెర్షన్ నుండి తొలగించవచ్చు, లేదా వాటిని అదనపు యాక్సెసరీస్ రూపంలో అందించవచ్చు.
"మహీంద్రాకు చెందిన సరికొత్త NU_IQ ప్లాట్ఫారమ్ బహుళ ఇంజిన్ ఆప్షన్లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ విజన్ ఎస్ ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఆప్షన్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది," అని ఆటో పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
3. మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీ..
మహీంద్రాకు చెందిన అత్యాధునిక 'INGLO' ప్లాట్ఫారమ్ ఆధారంగా తయారవుతున్న 'బీఈ 07' ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాదాపు ప్రొడక్షన్ వెర్షన్కు దగ్గరగా ఉండే రూపంలో ప్రదర్శించనున్నారు. ఈ కారు కాన్సెప్ట్ మోడల్లో చూపించిన ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్లను అలాగే ఉంచనున్నారు. క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, షార్ప్ డిజైన్ గల ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, స్పోర్టీ ఫ్రంట్ బంపర్, పెద్ద అలాయ్ వీల్స్, వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్లైన్, నిలువుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ల్యాంప్స్, చిన్న రియర్ విండ్షీల్డ్తో ఈ కారు రోడ్లపై తిరుగులేని లుక్ను ఇవ్వనుంది.
ఈ మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ కారు పవర్ట్రెయిన్ వివరాలు చూస్తే.. ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్యూవీ 9ఎస్ తరహాలోనే 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పంచుకునే అవకాశం ఉంది.
లాంచ్ నాటికి ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలను మహీంద్రా అధికారికంగా వెల్లడించనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


