...
...
Next Story

H-1B వీసాదారులకు ట్రంప్ షాక్: ఏకంగా $1,03,265 ఫీజుకు యోచన

కొత్త H-1B వీసాలపై ఏకంగా $1,03,265 (సుమారు రూ. 87 లక్షలు) రుసుమును శాశ్వతం చేసేందుకు అమెరికాలోని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) ప్రతిపాదించింది. 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం 2026 చివరి నాటికి ఈ నిర్ణయం ఖరారయ్యే అవకాశముంది.

Published on: Aug 24, 2026, 20:43:25 IST
Advertisement

హెచ్-1బి (H-1B) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. కొత్తగా జారీ చేసే హెచ్-1బి వీసాలపై ఏకంగా $1,03,265 (సుమారు రూ. 87 లక్షలకు పైగా) ఫీజును శాశ్వతం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదనలు విడుదల చేసింది.

H-1B వీసాదారులకు ట్రంప్ షాక్: ఏకంగా $1,03,265 ఫీజుకు యోచన
H-1B వీసాదారులకు ట్రంప్ షాక్: ఏకంగా $1,03,265 ఫీజుకు యోచన

గత ఏడాది ఒక తాత్కాలిక ఉత్తర్వు ద్వారా ట్రంప్ ఈ విధానాన్ని తీసుకురాగా, ఫెడరల్ న్యాయస్థానం దాన్ని నిలిపివేసింది. తాజాగా నిబంధనల రూపంలో DHS ఈ ఫీజును అమల్లోకి తెచ్చేందుకు 30 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. 2026 చివరి నాటికి ఈ నూతన ఫీజు విధానం ఖరారయ్యే అవకాశం ఉంది.

రూ. 87 లక్షల భారం.. కంపెనీలపై తీవ్ర ప్రభావం

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక హెచ్-1బి వీసా దరఖాస్తు కోసం అమెరికా కంపెనీలు సగటున $2,000 నుంచి $5,000 వరకు మాత్రమే ప్రభుత్వ రుసుము చెల్లిస్తున్నాయి. నూతన నిబంధన అమల్లోకి వస్తే కంపెనీలు ఒక్కో విదేశీ ఉద్యోగి కోసం ఏకంగా లక్ష డాలర్లకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది.

స్థానిక అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫీజును భారీగా పెంచుతున్నట్లు ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది. తక్కువ వేతనాలకే లభించే విదేశీ నిపుణులపై ఆధారపడటాన్ని తగ్గించడానికే ఈ కఠిన నిబంధనలు అని స్పష్టం చేసింది.

ఐటీ, టెక్ రంగానికి కోలుకోలేని దెబ్బ

అమెరికా ఏటా సాధారణ కేటగిరీ కింద 65,000 వీసాలు, అమెరికాలోనే ఉన్నత విద్య (మాస్టర్స్) అభ్యసించిన విదేశీయులకు అదనంగా 20,000 వీసాలను జారీ చేస్తుంది. ప్రధానంగా భారతీయ ఐటీ నిపుణులతో పాటు హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, పరిశోధన రంగానికి ఈ వీసా ఎంతో కీలకం.

ఈ ఫీజు విధానంపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జూన్ నెలలో ఒక ఫెడరల్ జడ్జి ఈ నిబంధన చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఫీజు వసూలును నిలిపివేశారు. ప్రస్తుతం బోస్టన్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టుతో పాటు వాషింగ్టన్ డీసీ కోర్టులోనూ దీనిపై విచారణలు నడుస్తున్నాయి.

యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు, పలు కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను కోర్టుల్లో సవాలు చేశాయి. "కాంగ్రెస్ (పార్లమెంట్) అనుమతి లేకుండా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి సొంతంగా ఇలాంటి భారీ రుసుములు విధించే అధికారం లేదు" అని పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. అయితే, విదేశీయుల రాకను నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉందంటూ ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చుతోంది. ఈ న్యాయపోరాటాల నేపథ్యంలో, DHS నిబంధనలను ఖరారు చేసినప్పటికీ ఈ ఫీజు అమలుపై అనిశ్చితి కొనసాగనుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe