...
...
Next Story

VB G RAM G : నేటి నుంచే ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’ అమలు.. పెరిగిన కూలీల వేతనాలు- ఏపీలోనే జాతీయ లాంచ్!

VB G RAM G : దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ఉన్న ‘ఉపాధి హామీ’ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ చట్టం.. నేటి నుంచి అమలులోకి వచ్చింది. వివరాలు..

Published on: Jul 1, 2026, 07:28:58 IST
Advertisement

గ్రామీణ ప్రాంతాల ఆర్థిక రూపురేఖలను మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్​గార్ అండ్ అజీవిక మిషన్- గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) పథకం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమైంది. పాత ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజులకు బదులుగా ఏకంగా 125 రోజుల పని దినాల చట్టబద్ధమైన గ్యారెంటీ లభించనుంది. దీనికి అనుగుణంగానే సవరించిన రోజువారీ కూలి రేట్లను కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది.

నేటి నుంచే వీబీ జీ రామ్ జీ చట్టం అమలు..
నేటి నుంచే వీబీ జీ రామ్ జీ చట్టం అమలు..

వీబీ జీ రామ్ జీ ఉపాధి చట్టం జాతీయ స్థాయి అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం విశేషం. జులై 2న తిరుపతి జిల్లా, ఓబులవారిపల్లె మండలంలోని ముక్కవారిపల్లి గ్రామంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మిషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.

కొత్త పథకంలో రోజువారి వేతనం..
కొత్త పథకంలో రోజువారీ వేతనం..

వీబీ జీ రామ్ జీ- కనీస వేతనం రూ. 300!

ఈ పథకం కింద దేశంలో ఎక్కడైనా సరే కనీస వేతనం రూ. 300 కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనతో ఒక ‘ఇంటర్మీడియట్ బేస్ వేజ్ రేట్’ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీనివల్ల దేశవ్యాప్తంగా సగటున 10 శాతానికి పైగా కూలి రేట్లు పెరిగాయి. గతంలో తక్కువ కూలి ఉన్న రాష్ట్రాలకు ఈ నిర్ణయం వల్ల భారీ లబ్ధి చేకూరనుంది. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం వంటి రాష్ట్రాలలో కూలి రేట్లు 15 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలలో అత్యధికంగా 24.5 శాతం మేర వేతనాలు పెరిగాయి.

వీబీ జీ రామ్ జీ- ఏ రాష్ట్రంలో ఎంత కూలి?

వీబీ జీ రామ్ జీలో భాగంగా ఈ సవరించిన వేతన నిర్మాణంలో ఇప్పటికే ఎక్కువ కూలి రేట్లు ఉన్న రాష్ట్రాలకు కూడా వేతనాలను పెంచారు. దీని ప్రకారం:

హరియాణా: రోజుకు రూ. 409

గోవా: రోజుకు రూ. 406

కేరళ: రోజుకు రూ. 401

సిక్కిం (ఎత్తైన ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలు): రోజుకు రూ. 450

ఈ నూతన విధానంలోకి సజావుగా మారడానికి, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలిక కేటాయింపుల కింద రూ. 95,692.31 కోట్లను విడుదల చేసింది.

వీబీ జీ రామ్ జీ- పాత జాబ్ కార్డులు చెల్లుతాయా?

"సమృద్ధికరమైన గ్రామాల ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో ఇదొక చారిత్రాత్మక అడుగు. అర్హులైన ఏ ఒక్క గ్రామీణ కార్మికుడు కూడా ఒక్క రోజు కూడా పని లేకుండా ఉండకూడదన్నదే మా ప్రభుత్వ ప్రాధాన్యత," అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.

ఈ కొత్త పథకం కింద కొత్తగా ‘గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డ్స్’ ఇచ్చేంత వరకు.. ప్రస్తుతం ఉన్న ఈ-కేవైసీ ధృవీకరించిన పాత జాబ్ కార్డులే చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక ఈ పథకం అమల్లో గ్రామ పంచాయతీలదే కీలక పాత్ర కానుంది. కేవలం గుంతలు తవ్వడమే కాకుండా.. సహజ వనరుల నిర్వహణ, జల సంరక్షణ, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత వంటి రంగాలపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఇప్పటికే 24 రాష్ట్రాలు తమ సొంత ‘వీబీ జీ రామ్ జీ’ రాష్ట్ర పథకాలను నోటిఫై చేయగా, అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు బడ్జెట్ నిబంధనలను కూడా పూర్తి చేశాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe