Electric Scooters : వచ్చేస్తోంది విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్ సంచలనం.. రూ. 81 వేలకే ఈ-స్కూటర్!

Vinfast Electric Scooters : భారత ఈవీ మార్కెట్​పై పట్టు సాధించేందుకు విన్​ఫాస్ట్​ ఇండియా క్రేజీ ప్లాన్​ రచిస్తోంది. 3 ఈ-స్కూటర్లను లాంచ్​ చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. వీటి విశేషాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Mar 28, 2026, 09:10:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇప్పటికే 'మేడ్ ఇన్ ఇండియా' వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లతో వేగంగా దూసుకెళుతున్న వియత్నాం ఆటో దిగ్గజం విన్‌ఫాస్ట్.. ఇప్పుడు మార్కెట్​లోని ఇతర విభాగాలపై కన్నేసింది! ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు గతంలోనే వెల్లడించిన సంస్థ, ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. వియత్నాం మార్కెట్​లో విక్రయిస్తున్న మూడు ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్‌కు తీసుకువస్తున్నట్లు సమాచారం.

విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు..
విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు..

భారత్‌లోకి వస్తున్న ఆ మూడు ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇవే!

విన్‌ఫాస్ట్ నుంచి తొలుత ఇవో, ఫెలిజ్, వైపర్ ఎలక్ట్రిక్​ స్కూటర్లు భారత్‌లోకి రానున్నాయని కంపెనీ ధృవీకరించింది. ఈ మూడు స్కూటర్లు కూడా ఎల్​ఎఫ్​పీ బ్యాటరీలను, హబ్-మౌంటెడ్ మోటార్లను కలిగి ఉంటాయి. ప్రతి మార్కెట్‌లోని స్థానిక వినియోగ పరిస్థితులు, ప్రయాణ అలవాట్లకు అనుగుణంగా ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నట్లు విన్‌ఫాస్ట్ పేర్కొంది.

విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు- తయారీ, విస్తరణ ప్రణాళికలు..

ప్రారంభంలో ఈ స్కూటర్లు వియత్నాం నుంచి సీకేడీ (కంప్లీట్లీ నాక్​డ్​ డౌన్​) యూనిట్లుగా భారత్‌కు వస్తాయి. వీటిని తమిళనాడులోని ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తారు. తూత్తుకుడిలోని సిప్‌కాట్ ఇండస్ట్రియల్ పార్క్‌లో సుమారు 200 హెక్టార్ల భూమి కేటాయింపు కోసం తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను విస్తరించేందుకు ఈ భూమిని ఉపయోగించనున్నారు.

విన్‌ఫాస్ట్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారాన్ని 2026 నుంచే సీకేడీ మోడళ్లతో ప్రారంభించనుంది. అయితే, భవిష్యత్తులో ఈ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో భారత్‌లోనే తయారు చేసే అవకాశం ఉందని కంపెనీకి సన్నిహితంగా ఉన్న వర్గాలు తెలిపాయి.

విన్​ఫాస్ట్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు- పూర్తి వివరాలు..

ఈ స్కూటర్ల నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఫెలిజ్, వైపర్ మోడళ్లు ఆగ్నేయాసియా దేశాల్లో సాధారణంగా కనిపించే పెద్ద చక్రాల (14-ఇంచ్) సాంప్రదాయ అండర్‌బోన్ తరహాలో ఉంటాయి. అయితే ఇవో మాత్రం 12-ఇంచ్​ చక్రాలతో మన భారతీయ రోడ్లపై కనిపించే సాధారణ స్కూటర్ల మాదిరిగా ఉంటుంది.

ఇవో : ఇందులో రెండు 2.4kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది 2.25kW పీక్ పవర్ ఇచ్చే హబ్-మౌంటెడ్ మోటార్‌తో పనిచేస్తుంది. 770 ఎంఎం సీటు ఎత్తు, 110 కిలోల తక్కువ బరువు, 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా వంటి భారతీయ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లకు కొన్ని పారామీటర్లలో గట్టి పోటీనిస్తుంది. దీని ధర వియత్నాంలో 2,28,00,000 వీఎన్డీ (సుమారు రూ. 81,204).

ఫెలిజ్- వైపర్ : ఇవి 14- ఇంచ్ చక్రాలపై నడుస్తాయి. ఫెలిజ్ 3kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా, వైపర్ 4.8kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. వైపర్ 3kW పవర్‌ఫుల్ మోటార్‌తో వస్తుండగా, ఫెలిజ్ 2.8kW మోటార్‌ను కలిగి ఉంది. వైపర్ ధర సుమారు రూ.1.63 లక్షలు (4,55,00,000 వీఎన్డీ) కాగా, ఫెలిజ్ ధర సుమారు రూ. 96,000 (2,69,00,000 వీఎన్డీ) గా ఉంది.

మరోవైపు, భారత మార్కెట్ కోసమే ప్రత్యేకంగా తయారు చేసే స్కూటర్ల పనులు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతున్నాయి. అయితే ఈ మోడళ్లు ఎప్పుడు విడుదలవుతాయనేది ప్రస్తుతానికి తెలియదు.

కాగా.. మూడు ఎలక్ట్రిక్​ స్కూటర్లతో పాటు ఈ ఏడాది మూడు ఎలక్ట్రిక్​ కార్లను సైతం లాంచ్​ చేసేందుకు విన్​ఫాస్ట్​ సంస్థ రెడీ అవుతోంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. విన్‌ఫాస్ట్ స్కూటర్లు నేరుగా వియత్నాం నుంచి వస్తాయా లేదా భారత్‌లోనే తయారవుతాయా?

ప్రారంభంలో విన్‌ఫాస్ట్ తన స్కూటర్లను వియత్నాం నుంచి సీకేడీ రూపంలో అంటే విడిభాగాలను దిగుమతి చేసుకుని, తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తుంది. అయితే, భారత ప్రభుత్వం- తమిళనాడు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం, భవిష్యత్తులో ఈ స్కూటర్లను పూర్తిస్థాయిలో స్థానికంగానే తయారు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ధరలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

2. భారత్‌లో లభించే టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి స్కూటర్లకు 'విన్‌ఫాస్ట్ ఇవో' ఎలా పోటీ ఇస్తుంది?

విన్‌ఫాస్ట్ ఇవో మోడల్ మన దేశంలోని పాపులర్ ఈ-స్కూటర్ల మాదిరిగానే 12- ఇంచ్ చక్రాలు, 770 ఎంఎం అనుకూలమైన సీటు ఎత్తును కలిగి ఉంది. ఇది 70 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకోగలదు. దీని బరువు కేవలం 110 కిలోలు మాత్రమే. దీని ధర సుమారు రూ. 81,200 (ఎక్స్​ఛేంజ్ రేటు ప్రకారం) ఉండటం వల్ల, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఇది టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా వంటి మోడళ్లకు బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More