Vivo smartphone : వివో ఎక్స్200టీ వర్సెస్ ఎక్స్300- ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
వీవో నుంచి వచ్చిన కొత్త మోడల్ ఎక్స్200టి బడ్జెట్ ధరలో ఫ్లాగ్షిప్ ఫీచర్లను అందిస్తుండగా, ఎక్స్300 అల్టిమేట్ పెర్ఫార్మెన్స్తో మార్కెట్లోకి వచ్చింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ధర, కెమెరా, బ్యాటరీ పరంగా ఏది గెలుస్తుందో ఈ కథనంలో చూడండి.
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి వీవో తన సరికొత్త ప్రీమియం మోడల్ 'వీవో ఎక్స్200టీ'ని ఇటీవలే విడుదల చేసింది. దీనిని 'ఫ్లాగ్షిప్ కిల్లర్'గా కంపెనీ ప్రమోట్ చేస్తోంది. అంటే.. అత్యున్నత స్థాయి ఫీచర్లను, కాస్త అందుబాటు ధరలోనే అందించడం అన్నమాట. అయితే, కేవలం రెండు వారాల ముందే వీవో తన అసలైన ఫ్లాగ్షిప్ మోడల్ 'వీవో ఎక్స్300'ను కూడా లాంచ్ చేసింది. దీనితో ఇప్పుడు వినియోగదారుల్లో ఒకటే సందిగ్ధత.. తక్కువ ధరలో వచ్చే ఎక్స్200టీ కొనాలా? లేక అల్టిమేట్ కెమెరా, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎక్స్300 తీసుకోవాలా? ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము.

వివో ఎక్స్200టీ వర్సెస్ వివో ఎక్స్300- బ్యాటరీ, ఛార్జింగ్..
బ్యాటరీ విషయానికి వస్తే, వివో ఎక్స్200టీలో 6,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఎక్స్300లో 6,040ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. రెండింటిలోనూ 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. ఎక్స్300 బ్యాటరీ కొంచెం చిన్నదైనప్పటికీ, అందులోని ఎల్టీపీఓ స్క్రీన్ వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్స్200టీకి సమానంగానే వస్తుంది.
వివో ఎక్స్200టీ వర్సెస్ వివో ఎక్స్300- డిజైన్, డిస్ప్లే..
పైకి చూస్తే ఈ రెండు వివో స్మార్ట్ఫోన్లు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. ప్రీమియం గ్లాస్ బ్యాక్, మెటాలిక్ సైడ్ ఫ్రేమ్, వెనుక భాగంలో పెద్ద సర్క్యులర్ కెమెరా ఐలాండ్.. ఇలా రెండింటిలోనూ డిజైన్ విషయంలో వివో రాజీ పడలేదు. ఈ రెండు ఫోన్లు కూడా ఐపీ68 + ఐపీ69 రేటింగ్తో వస్తున్నాయి. అంటే నీరు, దుమ్ము నుంచి వీటికి పూర్తి రక్షణ ఉంటుంది.
అయితే, డిస్ప్లే దగ్గరకు వచ్చేసరికి అసలు తేడా కనిపిస్తుంది. వీవో ఎక్స్300 ఒక 'కాంపాక్ట్' ఫ్లాగ్షిప్. ఇందులో 6.31 ఇంచ్ ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇది తక్కువ విద్యుత్ వినియోగించుకుంటూ అద్భుతమైన విజువల్స్ ఇస్తుంది. దీని బరువు కూడా కేవలం 190 గ్రాములే.
మరోవైపు, వీవో ఎక్స్200టీ పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారి కోసం రూపొందించారు. ఇందులో 6.67 ఇంచ్ అమోలెడ్ ప్యానెల్ ఉంది. ఎక్స్300లో బ్రైట్నెస్ 4,500 నిట్స్ ఉంటే, ఎక్స్200టీలో ఏకంగా 5,000 నిట్స్ వరకు ఉంటుంది. అంటే ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
వివో ఎక్స్200టీ వర్సెస్ వివో ఎక్స్300- పెర్ఫార్మెన్స్..
వీవో ఎక్స్200టీలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ చిప్సెట్ వాడారు. ఇది రోజువారీ పనులు, మల్టీ టాస్కింగ్, గేమింగ్ను చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6పై నడుస్తుంది.
కానీ, వీవో ఎక్స్300 స్మార్ట్ఫోన్ ఒక అడుగు ముందుకేసి డైమెన్సిటీ 9500 చిప్సెట్తో వస్తోంది. బెంచ్మార్క్ గణాంకాల ప్రకారం.. ఇది ఎక్స్200టీ కంటే సుమారు 15 నుంచి 30 శాతం వేగంగా పనిచేస్తుంది. గ్రాఫిక్స్తో కూడిన భారీ గేమ్స్ ఆడేవారికి ఎక్స్300 ఒక వరం లాంటిది.
వివో ఎక్స్200టీ వర్సెస్ వివో ఎక్స్300- కెమెరా..
ఈ రెండు వివో స్మార్ట్ఫోన్స్లోనూ వెనుక వైపు 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నప్పటికీ, సెన్సార్ల విషయంలో స్పష్టమైన తేడా ఉంది. వీవో ఎక్స్300లో 200 ఎంపీ (1/1.14 ఇంచ్) మెయిన్ కెమెరా ఉంది, ఇది అద్భుతమైన డిటైలింగ్తో ఫోటోలను తీస్తుంది. సెల్ఫీల కోసం ఇందులో 50 ఎంపీ కెమెరా ఇచ్చారు.
ఎక్స్200టీలో 1/1.56 ఇంచ్ మెయిన్ సెన్సార్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అయితే, ఎక్స్200టీ కేవలం ‘జీస్ ఆప్టిక్స్’ను ఉపయోగిస్తే, ఎక్స్300లో జీస్ టీ* కోటింగ్తో పాటు ప్రత్యేకమైన వీ+ ఇమేజింగ్ చిప్ను కూడా అందించారు. దీనివల్ల ప్రొఫెషనల్ స్థాయి క్వాలిటీ ఫోటోలు వస్తాయి.
వివో ఎక్స్200టీ వర్సెస్ వివో ఎక్స్300- ఏది కొనాలి?
వీవో ఎక్స్300: ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 75,999. ఫోటోగ్రఫీ మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే, అత్యుత్తమ పెర్ఫార్మెన్స్, కాంపాక్ట్ డిజైన్ కావాలనుకుంటే.. ఎక్స్300 కోసం అదనపు ఖర్చు చేయడం వర్త్ అనిపిస్తుంది.
వీవో ఎక్స్200టీ: దీని ప్రారంభ ధర రూ. 59,999. మీకు తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియెన్స్, పెద్ద స్క్రీన్, మెరుగైన బ్యాటరీ కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఛాయిస్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


