...
...
Next Story

Quote of the Day: షేర్ మార్కెట్ జూదంలా మారింది: ఇన్వెస్టర్లకు వారెన్ బఫెట్ హెచ్చరిక

Quote of the Day: పెట్టుబడులను జూదంలా మార్చేస్తున్నారంటూ ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షార్ట్ టర్మ్ లాభాల వెనుక పరిగెత్తకుండా, కంపెనీల దీర్ఘకాలిక విలువపై దృష్టి పెట్టాలని ఇన్వెస్టర్లకు సూచించారు.

Published on: Jun 5, 2026, 08:00:11 IST
Advertisement

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ ప్రస్తుత ధోరణులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మార్కెట్లలో రోజురోజుకూ పెరుగుతున్న ఊహాగానాలు (Speculation), స్వల్పకాలిక ట్రేడింగ్‌లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

వారెన్ బఫెట్
వారెన్ బఫెట్

"ప్రజలు ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం జూదం ఆడే మూడ్‌లో ఉన్నారు. దీని అర్థం పెట్టుబడులు పెట్టడం తప్పని కాదు. కానీ చాలా వస్తువులు, షేర్ల ధరలు అత్యంత హాస్యాస్పదంగా పెరిగిపోయాయని మాత్రం స్పష్టమవుతోంది" అని మే 2026లో జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక వాటాదారుల సమావేశంలో వారెన్ బఫెట్ వ్యాఖ్యానించారు.

చాలా మంది విశ్లేషణలు, దీర్ఘకాలిక ప్రణాళికలను పక్కనబెట్టి, కేవలం త్వరితగతిన లాభాలు సంపాదించాలనే ఆరాటంతో మార్కెట్లలోకి వస్తున్నారని 'ఒమాహా ఒరాకిల్'గా పిలిచే బఫెట్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ధోరణి వల్ల ఆస్తుల లేదా షేర్ల అసలు విలువతో సంబంధం లేకుండా ధరలు విపరీతంగా పెరిగిపోతాయని హెచ్చరించారు.

జూదానికి, పెట్టుబడికి తేడా ఏంటి?

పెట్టుబడి పెట్టడం అనేది సంపదను సృష్టించే ఒక శక్తిమంతమైన మార్గం. అయితే, కేవలం సోషల్ మీడియా ట్రెండ్‌లు, పుకార్లను నమ్మి నిర్ణయాలు తీసుకున్నప్పుడు సమస్యలు మొదలవుతాయి. మార్కెషట్‌లో ఇటువంటి కృత్రిమమైన ధరల పెరుగుదల ఎక్కువ కాలం నిలబడదని, మార్కెట్ కుదుపునకు గురైనప్పుడు ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన గుర్తుచేశారు.

స్టాక్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్.. ఇలా రంగం ఏదైనా మార్కెట్లలో విపరీతమైన జోష్ ఉన్నప్పుడు, లాభాల అవకాశాన్ని ఎక్కడ కోల్పోతామేమో అనే భయం (FOMO) ప్రజలను ఆవహిస్తుంది. ఆర్థిక మార్కెట్లు కేవలం గణాంకాలు, వాస్తవాల ఆధారంగానే కాకుండా, మానవ భావోద్వేగాల వల్ల కూడా ప్రభావితమవుతాయని బఫెట్ మాటలు నిరూపిస్తున్నాయి.

డిజిటల్ యుగంలో భావోద్వేగాల మార్కెట్

నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా వేదికల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు, మార్కెట్ అంచనాలు క్షణాల్లో వ్యాపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇతరుల భయాందోళనలు లేదా అత్యాశకు లోనుకాకుండా, హేతుబద్ధంగా ఆలోచించడం ఎంతో అవసరం. చరిత్రలో ఇలాంటి బుడగలు (Speculative bubbles) ఎన్నో వచ్చి పేలిపోయాయని, త్వరితగతిన లాభాలు ఆశించే అలవాటే ఇన్వెస్టర్లను ముంచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, ఇన్వెస్టర్, దాత. బెర్క్‌షైర్ హాత్వే సంస్థకు చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న ఆయనను చరిత్రలోనే అత్యంత గొప్ప పెట్టుబడిదారుడిగా పరిగణిస్తారు. 'వాల్యూ ఇన్వెస్టింగ్' విధానాన్ని నమ్మే బఫెట్, మంచి నాణ్యత గల వ్యాపారాలను సరసమైన ధరలకు కొనుగోలు చేసి, వాటిని దశాబ్దాల పాటు తన వద్దే ఉంచుకుంటారు. ఆర్థిక ప్రపంచంలో ఆయన అందించే సలహాలు కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe