...
...
Next Story

Exit Poll 2026: ఎగ్జిట్ పోల్స్ జాతర: బెంగాల్, తమిళనాడు, కేరళపై సర్వత్రా ఆసక్తి

Exit Poll 2026: నేడు సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు ఫలితాల అంచనాలు కూడా వెల్లడి కానున్నాయి.

Published on: Apr 29, 2026, 11:08:36 IST
Advertisement

వారాల తరబడి సాగిన హోరాహోరీ ప్రచారం.. నేతల మధ్య మాటల యుద్ధం.. ఓటర్ల తీర్పు.. వెరసి 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని 142 స్థానాలకు బుధవారం జరుగుతున్న రెండో విడత (చివరి దశ) పోలింగ్‌తో ఈ ఎన్నికల కోలాహలం ముగియనుంది. ఇప్పుడు అందరి దృష్టి, ఆసక్తి కేవలం ఒక్క అంశంపైనే ఉన్నాయి.. అవే 'ఎగ్జిట్ పోల్స్'.

సాయంత్రం 6:30 తర్వాతే అసలు లెక్కలు

నేటి సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్ అంచనాలు
నేటి సాయంత్రం వెలువడనున్న ఎగ్జిట్ పోల్ అంచనాలు

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. చివరి ఓటు పడే వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడం నిషిద్ధం. బెంగాల్‌లో పోలింగ్ సమయం ముగిసిన వెంటనే, అంటే బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించడం ప్రారంభిస్తాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం (RP Act 1951) లోని సెక్షన్ 126A ప్రకారం.. ఏప్రిల్ 9 ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ ఇప్పటికే హెచ్చరించింది.

గత అనుభవాలు.. పాఠాలు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎప్పుడూ నూటికి నూరు శాతం నిజం కావాలని లేదు. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని.. మమతా బెనర్జీ పార్టీకి దాదాపు 156 సీట్లు వస్తాయని చాలా సర్వేలు అంచనా వేశాయి. కానీ, ఫలితాలు వచ్చేసరికి దీదీ ప్రభంజనం సృష్టించారు. ఏకంగా 215 సీట్లతో టీఎంసీ ఘనవిజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలకే పరిమితమైంది. అందుకే, ఈసారి సర్వేలు ఏ మేరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఏ ఏ రాష్ట్రాల జాతకం తేలనుంది?

ప్రదీప్ గుప్తా నేతృత్వంలోని 'యాక్సిస్ మై ఇండియా' వంటి ప్రముఖ సంస్థలు ఎన్డీటీవీ (NDTV) వంటి ప్రధాన వార్తా ఛానళ్లలో తమ విశ్లేషణలను వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చో వీరు వెల్లడిస్తారు. మే 2వ తేదీన అసలు ఫలితాలు వచ్చే లోపు, ఈ ఎగ్జిట్ పోల్స్ రాజకీయ పార్టీలలో గుబులును, ఇన్వెస్టర్లలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి?

పోలింగ్ ముగిసిన వెంటనే ఓటర్ల అభిప్రాయం ఆధారంగా సర్వే సంస్థలు రూపొందించే ఎన్నికల అంచనాలను ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఇది ఓటర్ల నాడిని ప్రతిబింబించే ప్రయత్నం.

2. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి?

పశ్చిమ బెంగాల్‌ చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత, అంటే ఏప్రిల్ 29 సాయంత్రం 6:30 గంటల నుంచి ఇవి వెల్లడవుతాయి.

3. వీటిపై ఎందుకు ఆంక్షలు విధిస్తారు?

పోలింగ్ జరుగుతున్న సమయంలో వెలువడే అంచనాలు ఓటర్ల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ చివరి దశ పోలింగ్ పూర్తయ్యే వరకు వీటిని నిషేధిస్తుంది.

4. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కరెక్ట్‌గా ఉంటాయా?

కచ్చితంగా అని చెప్పలేం. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. 2021 బెంగాల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, తుది ఫలితాల మధ్య భారీ తేడా కనిపించిన సంగతి తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe