...
...
Next Story

Lionel Messi : 2030 ఫిఫా వరల్డ్​ కప్​ వరకు మెస్సి ఆడతాడా? ఇదే అతని సమాధానం..

Lionel Messi age : ఫిఫా వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సి దూసుకెళుతున్నాడు. అతని జోష్​ చూస్తున్న అభిమానులు.. మెస్సీ 2030 ఫిఫా వరల్డ్​ కప్​లో కూడా ఆడాలని కోరుకుంటున్నారు. దీనిపై మెస్సి స్పందించాడు.

Published on: Jun 25, 2026 06:36 AM IST
Advertisement

ఫిపా వరల్డ్​ కప్ 2026లో ఫుట్​బాల్​ లెజెండ్ లియోనెల్​ మెస్సి హవా కొనసాగుతోంది. ఈ అర్జెంటీనా స్టార్ ప్లేయర్.. తన ఆటతో ఫుట్​బాల్​ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అభిమానులు.. మెస్సీ 2030 వరల్డ్​ కప్​ కూడా ఆడాలని కోరుకుంటున్నారు. ఇదే ప్రశ్నను మెస్సిని అడగ్గా.. అతను ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

2030 వరల్డ్ కప్ ఆడతాడా? మెస్సి సమాధానం ఇదే!

లియోనెల్​ మెస్సి.. (Getty Images via AFP)
లియోనెల్​ మెస్సి.. (Getty Images via AFP)

బుధవారం తన 39వ పుట్టినరోజు జరుపుకున్న మెస్సి.. ఇలాగే నిరంతరాయంగా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నప్పటికీ, 2030లో స్పెయిన్ వేదికగా జరిగే తదుపరి ప్రపంచకప్ నాటికి మెస్సి వయసు 42 ఏళ్లకు చేరుకుంటుంది. అప్పటివరకు అతను ఆడతాడా లేదా అనే ప్రశ్నపై ప్రస్తుత వరల్డ్ కప్ వేదికగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు మెస్సి స్పష్టత ఇచ్చాడు.

"శారీరకంగా ఫిట్‌గా ఉంటూ, జట్టుకు నా వంతు సహకారం అందించగలిగినంత కాలం నేను మైదానంలో ఆటను కొనసాగిస్తూనే ఉంటాను. కచ్చితంగా మరికొంత కాలం పాటు నేను ఆడతాను," అని మెస్సి తెలిపాడు. అయితే, 2030 ప్రపంచకప్‌లో ఆడతారా అని అడగ్గా.. "నాకు తెలియదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను దాని గురించి అస్సలు ఆలోచించడం లేదు. అది చాలా దూరంలో ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం నేను రేపటి గురించి కాకుండా, ఈ రోజుపై మాత్రమే దృష్టి పెట్టాను," అని మెస్సి పేర్కొన్నాడు.

ఫిఫా వరల్డ్​ కప్ 2026లో ఇలా..

ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో మెస్సి మ్యాజిక్ పీక్స్‌కు చేరింది. టోర్నీలో అర్జెంటీనా ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే మెస్సి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా చేసిన మొత్తం 5 గోల్స్ కూడా మెస్సి ఒక్కడే చేయడం విశేషం.

మెస్సికి ఇది ఆరో (6వ) ప్రపంచకప్ కావడం గమనార్హం. 2006లో జర్మనీ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌తో ప్రయాణాన్ని ప్రారంభించిన మెస్సి.. 2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించి తన కల నెరవేర్చుకున్నాడు.

రౌండ్ ఆఫ్ 32కు అర్జెంటీనా అర్హత..

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఈ టోర్నీలో అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. గ్రూప్-జేలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి ముందే ‘రౌండ్ ఆఫ్ 32’ నాకౌట్ దశకు అర్హత సాధించింది.

తొలి మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో ఘనవిజయం సాధించగా.. అందులో మెస్సి హాట్రిక్ గోల్స్ కొట్టాడు.

రెండో మ్యాచ్‌లో ఆస్ట్రియాను 2-0తో ఓడించి నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనే మెస్సి రికార్డు స్థాయి 18వ గోల్ సాధించాడు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న అర్జెంటీనా, గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను జోర్డాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో నాకౌట్ లోపు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.

మెస్సి అద్భుతమైన కెరీర్ మైలురాళ్లు..

రోసారియోలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మెస్సిని అభిమానులు ప్రేమగా 'లా పుల్గా' (ది ఫ్లియా), 'మెస్సియా' అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ, క్లబ్ స్థాయిల్లో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు.

2005 అండర్-20 వరల్డ్ కప్, 2008 బీజింగ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్, 2021 కోపా అమెరికా, 2022 ఫైనలిస్సిమా, 2022 ఫిఫా వరల్డ్ కప్, 2024 కోపా అమెరికా టైటిళ్లను గెలిచి దేశానికి గోల్డెన్ ఎరాను అందించాడు.

బార్సిలోనా క్లబ్ తరఫున దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆడి 10 సార్లు లా లిగా టైటిళ్లు, 4 సార్లు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు, 7 సార్లు కోపా డెల్ రే కప్‌లతో పాటు ఎన్నో అంతర్జాతీయ ట్రోఫీలను సాధించి ఆ క్లబ్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

బార్సిలోనా వీడిన తర్వాత పారిస్ సెయింట్-జర్మన్ తరఫున 2022, 2023లలో లీగ్-1 టైటిళ్లను గెలుచుకున్నాడు. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఇంటర్ మయామి క్లబ్ తరఫున ఆడుతూ 2023 లీగ్స్ కప్, 2024 సపోర్టర్స్ షీల్డ్, 2025 ఎమ్‌ఎల్ఎస్ కప్ గెలిచి అంతర్జాతీయంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంటూనే ఉన్నాడు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe