Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే కాదు.. అసలైన పరమార్థం, పుణ్యఫలం ఇదీ!
Akshaya Tritiya: వైశాఖ శుక్ల పక్ష తదియ 'అక్షయ తృతీయ' వెనుక ఉన్న ఆధ్యాత్మిక నేపథ్యం, దానధర్మాల విశిష్టత మరియు పరశురామ జయంతి ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే కాదు. పరమార్థం, పుణ్యఫలం గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
సాధారణంగా అక్షయ తృతీయ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం. ఈ రోజున బంగారం కొంటే ఐశ్వర్యం అక్షయమవుతుందని ఒక నమ్మకం. అయితే, అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలైన అర్థం కేవలం కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఈ తిథికి ఎంతో విశిష్టత ఉంది. "అక్షయం" అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం.

ఈ రోజున చేసే జపం, తపం, దానం ఏవైనా సరే.. అవి అక్షయమైన పుణ్యఫలాన్ని అందిస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ మాసానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, అక్షయ తృతీయ రోజున చేసే సేవా కార్యక్రమాలకు విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
వ్రతం అంటే ఉపవాసం మాత్రమే కాదు
నేటి కాలంలో చాలా మంది వ్రతం అంటే కేవలం అన్నపానీయాలు మానేయడం లేదా కేవలం ఫలహారం తీసుకోవడం అని మాత్రమే భావిస్తున్నారు. కానీ వ్రతం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం అది కాదు. మనిషి తనలోని దుర్గుణాలను వదిలేసి, సన్మార్గంలో నడుస్తానని సంకల్పం తీసుకోవడమే నిజమైన వ్రతం.
"ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండటం. శారీరక శుద్ధితో పాటు మానసిక పరివర్తన ఈ రోజున అత్యంత ముఖ్యం. ఈ పవిత్ర దినాన దుర్గుణాలను వదిలి, సత్కర్మలు చేయడం వల్ల లభించే పుణ్యం తరతరాల వరకు నిలిచి ఉంటుందని కాశీ హిందూ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ గిరిజా శంకర్ శాస్త్రి పేర్కొన్నారు.
పరశురాముడి జన్మవృత్తాంతం
అక్షయ తృతీయ రోజే శ్రీమహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించాడు. మహర్షి జమదగ్ని, రేణుకా దేవి దంపతులకు ఆయన జన్మించారు. గీతాసారం ప్రకారం పరశురాముడు ఒక 'ఆవేశావతారం'. పరమశివుడిని మెప్పించి అజేయమైన 'పినాక' ధనస్సును, గొడ్డలిని (పరశువు) పొందిన పరాక్రమశాలి ఆయన.
ఆ తర్వాత ఆ ధనస్సును ఆయన జనక మహారాజుకు అప్పగించారు. విష్ణుమూర్తి తన శార్జ్ఞ ధనస్సును పరశురాముడికి ఇస్తూ.. "ఎవరైతే దీనికి అల్లెతాడు ఎక్కుపెడతారో, వారే నా పూర్ణావతారమని గుర్తించు" అని చెప్పారు. త్రేతాయుగంలో శ్రీరాముడు శివధనుస్సును విరిచినప్పుడు, పరశురాముడు తన బాధ్యత పూర్తయిందని గుర్తించి, మహేంద్రగిరిపై తపస్సుకు వెళ్ళారు.
ధర్మ సంస్థాపనలో చిరంజీవి
భగవంతుడి ఇతర అవతారాలన్నీ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని విష్ణులోకానికి చేరుకున్నాయి. కానీ పరశురాముడు మాత్రం చిరంజీవిగా ఈ భూలోకంలోనే ఉండిపోయారు. అహంకారంతో విర్రవీగిన సహస్రార్జునుడిని అంతం చేసిన తర్వాత కూడా ఆయనలోని క్రోధం తగ్గలేదు. ఆ సమయంలో ధర్మాన్ని, మర్యాదను కాపాడటానికి విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించాల్సి వచ్చింది. సనాతన సంస్కృతిలో మానవులనే కాకుండా పశుపక్ష్యాదులు, జలచరాల్లో కూడా దైవత్వాన్ని చూడటమే అవతారవాదం వెనుక ఉన్న లోతైన అంతరార్థం.
త్రేతాయుగానికి నాంది ఈ రోజే
అక్షయ తృతీయ అత్యంత పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం, ఈ రోజే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా అవతరించి, మధు-కైటభుల నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అప్పగించారు. నర-నారాయణుల అవతారం కూడా ఈ తిథి నాడే జరిగింది. జైన ధర్మంలోని మొదటి తీర్థంకరుడు రిషభదేవుడు తన సుదీర్ఘ తపస్సును విరమించింది కూడా ఈ రోజునే. అంతేకాకుండా, సుప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయ ద్వారాలు అక్షయ తృతీయ నాడే తెరుచుకుంటాయి.
దానమే అసలైన సంపద
మత్స్య పురాణం, విష్ణుధర్మోత్తర పురాణాల ప్రకారం, ఈ రోజున చేసే దానధర్మాలు అక్షయమవుతాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ సమయంలో ఇతరుల దాహం తీర్చడం, గొడుగులు, చెప్పులు దానం చేయడం విశేష ఫలితాన్నిస్తుంది. జల పాత్రను దానం చేయడం వల్ల అక్షయ కీర్తి లభిస్తుంది అని వేదవ్యాస మహర్షి తెలిపారు. స్వర్ణ దానం వల్ల కోరికలు నెరవేరుతాయి.
నెయ్యి లేదా ఔషధాలను దానం చేస్తే రోగ విముక్తి లభిస్తుంది. గొడుగు దానం ఆపదల నుంచి రక్షిస్తుంది. గోదానం వల్ల అమృతత్వం, భూదానం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతాయి. ముఖ్యంగా అన్నదానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ అక్షయ తృతీయను కేవలం ఆభరణాల కొనుగోలుకే పరిమితం చేయకుండా, పేదవారి ఆకలి తీర్చి పుణ్యాన్ని అక్షయం చేసుకుందాం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


