అక్షయ తృతీయ 2026: ఏప్రిల్ 20న అదృష్ట దినం.. ఈ తిధి వెనుక ఉన్న 10 విశేష గాధలు మీకు తెలుసా?

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజైన 'అక్షయ తృతీయ' ఈ ఏడాది ఏప్రిల్ 20న రాబోతోంది. సూర్యచంద్రులు ఇద్దరూ ఉచ్ఛస్థితిలో ఉండే ఈ రోజున ఏ పని చేసినా అది 'అక్షయం' (నశించనిది) అవుతుందని నమ్మకం. గంగమ్మ భూమికి దిగి రావడం నుంచి పరశురాముడి జననం వరకు ఈ పర్వదినం వెనుక ఉన్న 10 ఆసక్తికర పురాణ గాథలు ఇవే.

Published on: Apr 10, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైశాఖ శుద్ధ తృతీయ. దీనినే మనం 'అక్షయ తృతీయ' అని పిలుచుకుంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గ్రహ గతుల్లో అత్యంత కీలకమైన సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ తమ తమ ఉచ్ఛ రాశుల్లో ఉండి శుభ ఫలితాలను ఇస్తారు. ఆ రోజు ఎలాంటి ముహూర్తాలు చూడకుండానే ఏ శుభకార్యమైనా నిశ్చింతగా చేసుకోవచ్చు. అసలు అక్షయ తృతీయను ఎందుకు జరుపుకోవాలి? ఈ తిథి వెనుక ఉన్న 10 విశేష గాధలు తెలుసుకుందాం.

akshaya tritiya
akshaya tritiya

అక్షయ తృతీయ: ఈ తిధి వెనుక ఉన్న 10 విశేష గాధలు

1. గంగాదేవి భూమికి దిగివచ్చిన వేళ

నారద పురాణం ప్రకారం, భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగానది భూమిపైకి ప్రవహించిన రోజు ఇదే. స్వర్గం నుంచి ఉధృతంగా వచ్చిన గంగమ్మను శివుడు తన జటజూటంలో బంధించి, నియంత్రించి భూమిపైకి వదిలిన పుణ్యదినం కావడంతో ఇది పవిత్రమైంది.

2. పరశురాముడి జన్మదినం

శ్రీమహా విష్ణువు దశావతారాల్లో ఆరో అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు ఇదే. పురాణ పాత్రల్లో చిరంజీవి (అమరత్వం) పొందిన ఎనిమిది మందిలో పరశురాముడు ఒకరు. ఆయన అమరత్వానికి గుర్తుగా ఈ తిథిని 'అక్షయ' (ఎప్పటికీ ఉండేది) అని పిలుస్తారు.

3. త్రేతాయుగ ఆరంభం

పురాణాల ప్రకారం అక్షయ తృతీయను 'యుగాది తిథి' అని కూడా అంటారు. అంటే, సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైన రోజు ఇదే అని నమ్మకం.

4. మహాభారత రచనకు శ్రీకారం

వేదవ్యాసుడు మహాభారత కథను వినిపిస్తుంటే, వినాయకుడు దానిని రాయడం ప్రారంభించిన రోజు కూడా అక్షయ తృతీయే. అందుకే ఈ కావ్యం నేటికీ అక్షయంగా లోకమంతా వినిపిస్తోంది.

5. కుబేరుడికి దక్కిన పదవి

సంపదల అధిపతి కుబేరుడు ఈ రోజున పరమశివుడిని పూజించి మెప్పించాడని, అందుకే ఆయనను దేవతల ఖజానాకు అధిపతిగా (కోశాధికారి) శివుడు నియమించాడని పురాణాలు చెబుతున్నాయి.

6. సీతమ్మ అగ్ని పరీక్ష

పద్మపురాణం ప్రకారం, సీతాదేవి అగ్ని పరీక్షను ఎదుర్కొని తన పవిత్రతను నిరూపించుకున్న రోజు ఇదే. స్కంద పురాణం ప్రకారం, శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష తర్వాత మళ్ళీ స్వీకరించిన రోజు కూడా ఇదే.

7. పాండవులకు 'అక్షయ పాత్ర'

అరణ్యవాసంలో ఉన్న పాండవుల ఆకలి తీర్చడానికి శ్రీకృష్ణుడు వారికి 'అక్షయ పాత్ర'ను అందించిన రోజు ఇదే. ఈ పాత్రలో అన్నం ఎప్పటికీ తరగదు, అందుకే దీనికి అక్షయ పాత్ర అని పేరు వచ్చింది.

8. కృష్ణ-సుదామల కలయిక

పేదరికంలో ఉన్న కుచేలుడు (సుదాముడు) తన మిత్రుడైన శ్రీకృష్ణుడిని కలిసి అటుకులను సమర్పించిన రోజు ఇదే. ఆ అటుకులను స్వీకరించిన కృష్ణుడు కుచేలుడికి అక్షయమైన సంపదను ప్రసాదించాడు.

9. జైన ధర్మం

జైన మత ప్రథమ తీర్థంకరుడైన ఋషభదేవుడు 13 నెలల కఠిన ఉపవాసం తర్వాత చెరకు రసంతో తన ఉపవాసాన్ని విరమించిన రోజు ఇది.

10. ఇతర కారణాలు

ఆదిశంకరాచార్యులు 'కనకధారా స్తోత్రం' రచించిన రోజు.

బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు జన్మించిన రోజు.

పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన రోజు కూడా ఇదే.

అక్షయ తృతీయ 2026 ఎప్పుడు?

ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తేదీన వస్తోంది. పంచాంగం ప్రకారం తృతీయ తిథి ఏప్రిల్ 19నే ప్రారంభమైనప్పటికీ, సూర్యోదయ సమయానికి తిథి ఉన్న రోజునే (ఉదయ తిథి) పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఏప్రిల్ 20నే అక్షయ తృతీయ జరుపుకోవడం శాస్త్రసమ్మతం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More