సర్వ పాపాలను హరించే ఏకాదశి వ్రతంతో రాజుకు స్వర్గలోక ప్రాప్తి.. ఈ కథను చదివినా, విన్నా వెయ్యి గోదానాలు చేసినంత ఫలితం!

అపర ఏకాదశి వ్రత కథ: అపర ఏకాదశి విశిష్టత, ముహూర్తం, పూజా విధానం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు విష్ణువును భక్తితో కొలిస్తే గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథను చదివినా, విన్నా వెయ్యి గోదానాలు చేసినంత ఫలితం కలుగుతుంది.

Published on: May 13, 2026, 09:00:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'అపర ఏకాదశి' అని పిలుస్తారు. దీనికి 'అచల ఏకాదశి' అనే పేరు కూడా ఉంది. ఈ ఏడాది మే 13వ తేదీన అనగా ఈరోజు అపర ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఏకాదశి, ద్వాదశి తిథుల కలయిక ఉండటం వల్ల ఈ పర్వదినానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని పద్మపురాణం చెబుతోంది.

సర్వ పాపాలను హరించే ఏకాదశి వ్రతంతో రాజుకు స్వర్గలోక ప్రాప్తి (Pixabay)
సర్వ పాపాలను హరించే ఏకాదశి వ్రతంతో రాజుకు స్వర్గలోక ప్రాప్తి (Pixabay)

అపర ఏకాదశి విశిష్టత

"రాజేంద్రా! లోక కళ్యాణం కోసం నువ్వు మంచి విషయం అడిగావు. వైశాఖ కృష్ణ పక్ష ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఇది అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుంది. బ్రహ్మహత్య, గోత్ర హత్య, పిండహత్య వంటి మహా పాపాలు చేసిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాప విముక్తులవుతారు," అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించారు.

కేవలం శారీరక పాపాలే కాకుండా.. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, తూకాల్లో మోసం చేసేవారు, అర్హత లేకుండా వైద్యం చేసేవారు, యుద్ధం నుంచి పారిపోయే క్షత్రియులు కూడా ఈ వ్రత ప్రభావంతో పవిత్రులవుతారు. గురువును నిందించే వారు కూడా ఈ ఏకాదశి ఉపవాసంతో సద్గతి పొందుతారని పురాణ కథనం.

తీర్థయాత్రల ఫలితం మీ ఇంట్లోనే

అపర ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం అసాధారణమైనది. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో స్నానం చేసినా, కాశీలో శివరాత్రి వ్రతం చేసినా, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసినా ఎంత పుణ్యం వస్తుందో.. ఈ ఒక్క ఏకాదశి వ్రతం వల్ల అంతటి ఫలితం లభిస్తుంది. అలాగే సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు గోదావరి స్నానం చేసినా, బదరీనాథ్ యాత్ర చేసినా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో దానధర్మాలు చేసినా వచ్చే పుణ్యంతో ఈ వ్రతం సమానమని పెద్దలు చెబుతారు.

అపర ఏకాదశి వ్రత కథ

మహీధ్వజుడి కథ: ప్రేత రూపం నుంచి విముక్తి

పూర్వం మహీధ్వజుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. ఆయన తమ్ముడు వజ్రధ్వజుడు పరమ క్రూరుడు. అన్నపై ద్వేషంతో వజ్రధ్వజుడు ఆయనను చంపి, మృతదేహాన్ని అడవిలోని ఒక రావి చెట్టు కింద పాతిపెట్టాడు. అకాల మరణం చెందడం వల్ల మహీధ్వజుడు ప్రేతాత్మగా మారి అదే చెట్టుపై నివాసం ఉంటూ బాటసారులను ఇబ్బంది పెట్టేవాడు.

ఒకరోజు ధౌమ్య మహర్షి ఆ దారిలో వెళ్తూ తన తపోబలంతో రాజు గతాన్ని తెలుసుకున్నారు. ఆ ప్రేతాత్మను రావి చెట్టు నుంచి కిందకు దింపి, అతడికి పరలోక విద్యను బోధించారు. మహీధ్వజుడికి విముక్తి కల్పించడానికి ధౌమ్య మహర్షి స్వయంగా అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఆ పుణ్యాన్ని రాజుకు ధారపోశారు. ఆ వ్రత ప్రభావంతో రాజుకు దివ్యరూపం లభించి స్వర్గానికి చేరుకున్నాడు.

పూజా విధానం, నియమాలు

  • అపరా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును వామన రూపంలో పూజించాలి.
  • దశమి నాటి రాత్రి నుంచే నియమాలు పాటించాలి.
  • ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి, విష్ణువును భక్తితో అర్చించాలి.
  • ఈ రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్ఠం. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు తీసుకోవచ్చు.
  • ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి, విష్ణువుకు నైవేద్యం సమర్పించాలి.
  • ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణాదులు సమర్పించిన తర్వాతే భోజనం చేయాలి.
  • ఈ కథను చదివినా లేదా విన్నా కూడా వెయ్యి గోదానాలు చేసినంత ఫలితం దక్కుతుందని వేదవ్యాస మహర్షి వివరించారు.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More