మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప మార్గదర్శకుడు గౌతమ బుద్ధుడు. నేపాల్లోని లుంబినిలో ఒక రాజకుటుంబంలో జన్మించిన సిద్ధార్థుడు, రాజభోగాలను తృణప్రాయంగా భావించి లోక కల్యాణం కోసం, సత్య అన్వేషణ కోసం ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నారు. సిద్ధార్థుడు 'బుద్ధుడు'గా మారిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన బోధనలు వేల ఏళ్ల క్రితం ఎంతటి ప్రభావం చూపాయో, నేటి వేగవంతమైన ప్రపంచంలోనూ అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
అహింస - దుఃఖ నివారణకు మార్గం

బుద్ధుని ప్రధాన బోధనలలో అహింస అగ్రస్థానంలో ఉంటుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా మరొక జీవికి హాని చేయకూడదని ఆయన ఉద్బోధించారు. మనసు ఎప్పుడైతే హింసకు దూరమవుతుందో, అప్పుడే మనిషిలోని దుఃఖం క్రమంగా అంతరిస్తుందని బుద్ధుడు నమ్మారు. ప్రతి ప్రాణి జీవించాలని కోరుకుంటుంది తప్ప మరణించాలని కాదు. మనం సుఖాన్ని ఆశించినట్లే, ఇతర జీవులు కూడా సుఖాన్ని కోరుకుంటాయని గ్రహించినప్పుడు మనం ఎవరికీ కీడు చేయలేము.
సత్యం - ఎప్పటికీ దాచలేనిది
సత్యం యొక్క గొప్పతనం గురించి బుద్ధుడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు:
"సూర్యుడు, చంద్రుడు మరియు సత్యం.. ఈ మూడింటిని ఎవరూ ఎక్కువ కాలం దాచలేరు."
సమయం వచ్చినప్పుడు సూర్యచంద్రులు ఎలాగైతే ప్రకాశిస్తారో, సత్యం కూడా ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తుంది. అందుకే అబద్ధాలకు దూరంగా ఉండటమే మనిషికి క్షేమకరం. సత్యవాక్కే అమృతవాక్కు అని, అది సనాతన ధర్మమని ఆయన పేర్కొన్నారు.
విజయం మీ సొంతం కావాలంటే..
జీవితంలో విజయం సాధించడం అంటే వేల యుద్ధాలు గెలవడం కాదు, తనను తాను జయించడం. తన మనస్సును, ఆలోచనలను నియంత్రించుకోగలిగిన వ్యక్తికి లభించే విజయాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే, ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కంటే ఆ లక్ష్యం వైపు మనం సాగించే ప్రయాణం ఎంత పవిత్రంగా ఉందనేది ముఖ్యం.
బుద్ధుని మరి కొన్ని అమూల్యమైన సూత్రాలు:
అత్యుత్తమ సంపద: సంతృప్తియే అతిపెద్ద సంపద, విశ్వాసమే గొప్ప సంబంధం, ఆరోగ్యమే అన్నిటికంటే పెద్ద బహుమతి.
{{/usCountry}}అత్యుత్తమ సంపద: సంతృప్తియే అతిపెద్ద సంపద, విశ్వాసమే గొప్ప సంబంధం, ఆరోగ్యమే అన్నిటికంటే పెద్ద బహుమతి.
{{/usCountry}}స్వీయ కృషి: మీకు మోక్షం కావాలంటే మీరే శ్రమించాలి, ఇతరులపై ఆధారపడటం వల్ల ప్రయోజనం లేదు.
ప్రేమతోనే మార్పు: చెడును చెడుతో అంతం చేయలేం. ద్వేషాన్ని కేవలం ప్రేమతో మాత్రమే జయించగలం అనేది అక్షర సత్యం.
సాంగత్యం: ఎవరి సాంగత్యం వల్ల మీ ఆలోచనలు పవిత్రంగా మారుతాయో, వారు సాధారణ వ్యక్తులు కాదని, వారు గొప్ప మార్గదర్శకులని గుర్తించాలి.
అహింస, యజ్ఞాలు
ప్రాచీన కాలంలో కోరికలు, ఆకలి, వృద్ధాప్యం మాత్రమే మానవుడికి కష్టాలుగా ఉండేవని, కానీ పశుహింస పెరిగే కొద్దీ వ్యాధులు, కష్టాలు అసంఖ్యాకమయ్యాయని బుద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. యజ్ఞాల పేరుతో అమాయక జంతువులను బలి ఇవ్వడం అధర్మమని, ఇది నిందనీయమైన చర్య అని ఆయన ఖండించారు. జంతు బలి ద్వారా ధర్మం నశిస్తుందని, అహింస ద్వారానే అసలైన ధర్మం నిలబడుతుందని ఆయన బోధించారు.