...
...
Next Story

గౌతమ బుద్ధుని అమృత వాక్కులు: అంతర్గత శాంతికి, విజయానికి బుద్ధుడు చూపిన మార్గం ఇదే!

బౌద్ధమత స్థాపకుడు, మానవతావాది మహాత్మా గౌతమ బుద్ధుని బోధనలు నేటి ఆధునిక ప్రపంచానికి ఎంతో అవసరం. అహింస, కరుణ, మానసిక ప్రశాంతత గురించి బుద్ధుడు చెప్పిన సూత్రాలు కేవలం మతపరమైనవి మాత్రమే కావు, అవి మనిషిని ఉన్నత శిఖరాలకు చేర్చే జీవన మార్గాలు. ఆ అద్భుతమైన సందేశాల సమాహారం మీకోసం..

Published on: Apr 30, 2026, 15:30:24 IST
Advertisement

మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప మార్గదర్శకుడు గౌతమ బుద్ధుడు. నేపాల్‌లోని లుంబినిలో ఒక రాజకుటుంబంలో జన్మించిన సిద్ధార్థుడు, రాజభోగాలను తృణప్రాయంగా భావించి లోక కల్యాణం కోసం, సత్య అన్వేషణ కోసం ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నారు. సిద్ధార్థుడు 'బుద్ధుడు'గా మారిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన బోధనలు వేల ఏళ్ల క్రితం ఎంతటి ప్రభావం చూపాయో, నేటి వేగవంతమైన ప్రపంచంలోనూ అంతే ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

అహింస - దుఃఖ నివారణకు మార్గం

గౌతమ బుద్ధుని అమృత వాక్కులు: అంతర్గత శాంతికి, విజయానికి బుద్ధుడు చూపిన మార్గం ఇదే!
గౌతమ బుద్ధుని అమృత వాక్కులు: అంతర్గత శాంతికి, విజయానికి బుద్ధుడు చూపిన మార్గం ఇదే!

బుద్ధుని ప్రధాన బోధనలలో అహింస అగ్రస్థానంలో ఉంటుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా మరొక జీవికి హాని చేయకూడదని ఆయన ఉద్బోధించారు. మనసు ఎప్పుడైతే హింసకు దూరమవుతుందో, అప్పుడే మనిషిలోని దుఃఖం క్రమంగా అంతరిస్తుందని బుద్ధుడు నమ్మారు. ప్రతి ప్రాణి జీవించాలని కోరుకుంటుంది తప్ప మరణించాలని కాదు. మనం సుఖాన్ని ఆశించినట్లే, ఇతర జీవులు కూడా సుఖాన్ని కోరుకుంటాయని గ్రహించినప్పుడు మనం ఎవరికీ కీడు చేయలేము.

సత్యం - ఎప్పటికీ దాచలేనిది

సత్యం యొక్క గొప్పతనం గురించి బుద్ధుడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు:

"సూర్యుడు, చంద్రుడు మరియు సత్యం.. ఈ మూడింటిని ఎవరూ ఎక్కువ కాలం దాచలేరు."

సమయం వచ్చినప్పుడు సూర్యచంద్రులు ఎలాగైతే ప్రకాశిస్తారో, సత్యం కూడా ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తుంది. అందుకే అబద్ధాలకు దూరంగా ఉండటమే మనిషికి క్షేమకరం. సత్యవాక్కే అమృతవాక్కు అని, అది సనాతన ధర్మమని ఆయన పేర్కొన్నారు.

విజయం మీ సొంతం కావాలంటే..

జీవితంలో విజయం సాధించడం అంటే వేల యుద్ధాలు గెలవడం కాదు, తనను తాను జయించడం. తన మనస్సును, ఆలోచనలను నియంత్రించుకోగలిగిన వ్యక్తికి లభించే విజయాన్ని ఎవరూ లాక్కోలేరు. అలాగే, ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కంటే ఆ లక్ష్యం వైపు మనం సాగించే ప్రయాణం ఎంత పవిత్రంగా ఉందనేది ముఖ్యం.

బుద్ధుని మరి కొన్ని అమూల్యమైన సూత్రాలు:

స్వీయ కృషి: మీకు మోక్షం కావాలంటే మీరే శ్రమించాలి, ఇతరులపై ఆధారపడటం వల్ల ప్రయోజనం లేదు.

ప్రేమతోనే మార్పు: చెడును చెడుతో అంతం చేయలేం. ద్వేషాన్ని కేవలం ప్రేమతో మాత్రమే జయించగలం అనేది అక్షర సత్యం.

సాంగత్యం: ఎవరి సాంగత్యం వల్ల మీ ఆలోచనలు పవిత్రంగా మారుతాయో, వారు సాధారణ వ్యక్తులు కాదని, వారు గొప్ప మార్గదర్శకులని గుర్తించాలి.

అహింస, యజ్ఞాలు

ప్రాచీన కాలంలో కోరికలు, ఆకలి, వృద్ధాప్యం మాత్రమే మానవుడికి కష్టాలుగా ఉండేవని, కానీ పశుహింస పెరిగే కొద్దీ వ్యాధులు, కష్టాలు అసంఖ్యాకమయ్యాయని బుద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. యజ్ఞాల పేరుతో అమాయక జంతువులను బలి ఇవ్వడం అధర్మమని, ఇది నిందనీయమైన చర్య అని ఆయన ఖండించారు. జంతు బలి ద్వారా ధర్మం నశిస్తుందని, అహింస ద్వారానే అసలైన ధర్మం నిలబడుతుందని ఆయన బోధించారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe