ఈరోజు పద్మిని ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఈ 4 రోజులు శుభప్రదమైనవి.. ఈ అవకాశం మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతే.. ఏం చెయ్యాలంటే?
అధికమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వచ్చే రోజులు అత్యంత పవిత్రమైనవి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవి, శివుని అనుగ్రహం పొందేందుకు ఈ తిథుల్లో చేయాల్సిన పూజలు, పరిహారాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హిందూ సంప్రదాయంలో అధికమాసానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ నెల మొత్తం భక్తి శ్రద్ధలతో గడిపినప్పటికీ, ఈ ఐదు రోజులు అంటే ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు వచ్చే తిథులు అత్యంత శక్తివంతమైనవి.

ఈ సమయంలో చేసే స్నాన, దానాలు, జపాలకు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం విష్ణువు అనుగ్రహమే కాకుండా, మీ జాతకంలో గ్రహ దోషాలను తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఈ రోజులు గొప్ప అవకాశం కల్పిస్తాయి.
పద్మిని ఏకాదశి.. లక్ష్మీదేవి కటాక్షం
అధికమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి లేదా కమల ఏకాదశి అంటారు. మే 27వ తేదీ బుధవారం ఉదయం 06:22 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది, ఆ తర్వాత ద్వాదశి ప్రారంభమవుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల దారిద్య్రం తొలగిపోతుంది. ఎవరైతే భక్తితో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో, వారి ఇంట్లో సంపదకు లోటు ఉండదు అని పురాణ కథలు వివరిస్తున్నాయి. ఈ రోజున తులసి కోట వద్ద దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.
ప్రదోష వ్రతం.. శివకేశవుల అనుగ్రహం ఒకేసారి
సాధారణంగా అధికమాసం విష్ణువుకు అంకితం చేసినప్పటికీ, శివకేశవుల మధ్య అభేదాన్ని చాటిచెప్పేదే ఈ ప్రదోష వ్రతం. మే 28వ తేదీ గురువారం నాడు ద్వాదశి, త్రయోదశి కలయికతో ప్రదోష వ్రతం వస్తోంది. జాతకంలో శని, రాహు దోషాలతో బాధపడేవారికి ఈ రోజు ఒక వరం లాంటిది. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది. శివుడితో పాటు విష్ణువును పూజించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
అధిక మాస పౌర్ణమి.. కష్టాల నుంచి విముక్తి
అధిక మాసంలోని పౌర్ణమి తిథికి అత్యంత విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, ప్రతికూల శక్తులు నశిస్తాయి. ఈ ఏడాది పౌర్ణమి రెండు రోజులు వచ్చింది. మే 30వ తేదీ శనివారం నాడు వ్రతం చేసుకోవడానికి అనువైన తిథి ఉండగా, మే 31వ తేదీ ఆదివారం స్నాన, దానాలకు ప్రాముఖ్యత ఉంటుంది.
పూర్ణిమ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా ఈ రోజున చేసే దీపదానం మీ జీవితంలో వెలుగులు నింపుతుంది. పితృ తర్పణాల కోసం కూడా ఈ సమయం ఎంతో శ్రేష్ఠమైనది.
ముహూర్తాల వివరాలు:
మే 30 (శనివారం): చతుర్దశి ఉదయం 11:58 గంటల వరకు ఉంటుంది, ఆ తర్వాత పౌర్ణమి ప్రారంభమవుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేవారు ఈ రోజే జరుపుకోవాలి.
మే 31 (ఆదివారం): పౌర్ణమి తిథి మధ్యాహ్నం 02:15 గంటల వరకు ఉంటుంది. స్నానాలు, దాన ధర్మాలు చేసే వారు ఈ రోజును ఎంచుకోవాలి. సాయంత్రం 04:12 గంటల నుంచి గండమూల నక్షత్రం ప్రారంభమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి.
అధికమాసంలోని ఈ పుణ్య తిథుల్లో కేవలం భక్తితో భగవంతుడిని స్మరిస్తే చాలు, మీ జీవితంలోని అడ్డంకులు తొలగి సుఖసంతోషాలు చేకూరుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


