Solar Eclipse 2026 : ఆగస్టు 12న అరుదైన సూర్యగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం..?
2026 ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా అరుదైన సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం విశేషాలు, వివిధ దేశాల్లో కనిపించే సమయాలు, ద్వాదశ రాశులపై ఉండే ప్రభావానికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
భూగోళంపై మరో అద్భుత ఖగోళ వింతకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది శ్రావణ మాసంలో అత్యంత కీలకమైన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఖగోళ ప్రేమికులను ఎంతగానో అలరించే ఈ గ్రహణం ఆగస్టు 12, 2026 న సంభవించనుంది. దీని తర్వాత మళ్లీ వచ్చే ఏడాది అంటే ఆగస్టు 2, 2027న ఏర్పడే సూర్యగ్రహణం కూడా ఎంతో విశిష్టమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఈ రెండు గ్రహణాల ప్రత్యేకతలు ఏమిటి, ఇవి భారతదేశంలో కనిపిస్తాయా లేదా…. అలాగే ద్వాదశ రాశిచక్రాలపై వీటి జ్యోతిష్య ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఖగోళ శాస్త్రం ప్రకారం.. సూర్యుడు, భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ క్రమంలో సూర్యుడి కాంతి భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుగా నిలిచి తన నీడను సృష్టిస్తాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గణాంకాల ప్రకారం.. చంద్రుడి కంటే సూర్యుడు పరిమాణంలో దాదాపు 400 రెట్లు పెద్దదిగా ఉంటాడు. అదే సమయంలో భూమి నుంచి సూర్యుడు ఉన్న దూరం కూడా చంద్రుడి దూరంతో పోలిస్తే 400 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ దూరం, పరిమాణాల సమతుల్యత వల్లే గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కమ్మేసినట్లు మనకు కనిపిస్తుంది.
ఎక్కడెక్కడ కనిపిస్తుంది….?
2026 ఆగస్టు 12న సంభవించే సూర్యగ్రహణం ప్రధానంగా ఐరోపా (యూరప్), కెనడా, అమెరికా (యుఎస్) తో పాటు వాయువ్య అమెరికా ప్రాంతాల్లో విస్తరించి కనిపిస్తుంది. ఈ గ్రహణాన్ని మొదటగా వీక్షించే తొలి దేశంగా రష్యా నిలవనుంది. రష్యాలో సూర్యాస్తమయానికి సరిగ్గా రెండు గంటల ముందు ఈ ఖగోళ వింత దృశ్యమానం అవుతుంది. ఈ సంపూర్ణ గ్రహణ ప్రక్రియ మొత్తం ఒక గంట 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ఉత్తర అమెరికా, ఐరోపాలోని ప్రధాన ప్రాంతాల ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూస్తారు. సంపూర్ణ గ్రహణ మార్గానికి వెలుపల ఉన్న దేశాల్లో సైతం పాక్షిక గ్రహణమే కనిపిస్తుంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు సూర్యగ్రహణాలు రావడం సహజమే. కానీ… 2027 ఆగస్టు 2న రాబోయే సూర్యగ్రహణం అత్యంత అరుదైనది. రాబోయే కొన్నేళ్లలో ఇలాంటి సుదీర్ఘ గ్రహణాన్ని చూసే అవకాశం మళ్లీ రాదు. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని "ఈ శతాబ్దపు అతిపెద్ద గ్రహణం" అని పిలుస్తున్నారు.
ఈ గ్రహణం దక్షిణ స్పెయిన్, ఉత్తర అమెరికా , అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏకంగా 6 నిమిషాల 23 సెకన్ల పాటు కొనసాగుతుంది. అంటే ఆయా ప్రాంతాల్లో దాదాపు 6 నిమిషాల పాటు పగటి పూటే కటిక చీకటి కమ్ముకుంటుంది. అయితే…. ఈ గ్రహణ సమయాల్లో సూర్యుడి వైపు నేరుగా చూడకూడదని, అలా చూస్తే కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతదేశంలో ఉంటుందా? రాశులపై ఎలాంటి ప్రభావం?
ఆగస్టు 12న సంభవించే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. మన దేశంలో గ్రహణం దృశ్యమానం కానందున ఎలాంటి సూతక కాలం (నియమాలు) పాటించాల్సిన అవసరం లేదు. అయితే, దృశ్యరూపంలో కనిపించకపోయినప్పటికీ, విశ్వంలో జరిగే ఈ మార్పుల వల్ల జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 12 రాశుల వారిపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే:
- మేష రాశి : ఈ రాశి వారికి సరికొత్త వ్యాపార, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి పథంలో నడుస్తారు.
- వృషభ రాశి : కుటుంబ విషయాలకు, ఇంటి వాతావరణానికి ఈ సమయంలో పెద్ద పీట వేస్తారు. బంధాలు బలపడతాయి.
- మిథున రాశి : కెరీర్ పరంగా సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి.
- కర్కాటక రాశి : ఆర్థిక పరమైన విషయాల్లో ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం. అనవసర ఖర్చులు తగ్గించాలి.
- సింహ రాశి : ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
- కన్యా రాశి : మానసిక ఆందోళనలు, భావోద్వేగ భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రశాంతత చేకూరుతుంది.
- తులా రాశి : మీ మనసులో చాలా కాలంగా నిలిచిపోయిన చిరకాల కలలు, కోరికలు ఈ కాలంలో నెరవేరుతాయి.
- వృశ్చిక రాశి : ఉద్యోగ, వృత్తిపరమైన జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. స్థాన చలనం ఉండవచ్చు.
- ధనుస్సు రాశి : విద్యార్థులకు అనుకూల సమయం. వ్యక్తిగత ఎదుగుదలతో పాటు నూతన విషయాలను నేర్చుకుంటారు.
- మకర రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా అందుతుంది.
- కుంభ రాశి : బంధుమిత్రులు, భాగస్వాములతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది.
- మీన రాశి : ఈ రాశి వారికి గ్రహణ ప్రభావం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఉద్యోగ జీవనానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత (బ్యాలెన్స్) పాటించడం ముఖ్యం. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

