తొలి ఏకాదశి విశిష్టత.. శ్రీహరి యోగనిద్ర, చాతుర్మాస దీక్షలు, ఆచారాల పూర్తి వివరాలు ఇవిగో!
ఆషాఢ శుక్ల ఏకాదశిగా జరుపుకునే దేవశయని ఏకాదశి ఈ ఏడాది జూలై 25న వస్తోంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడనే విశ్వాసంతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు.
హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినాల్లో దేవశయని ఏకాదశి ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశిగా పిలుస్తారు. ఈ పవిత్ర దినాన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

కార్తిక మాసంలో దేవోత్థాన ఏకాదశి వచ్చే వరకు ఆయన పాతాళ లోకంలోనే నివసిస్తారనే నమ్మకం ఉంది. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్లడంతో ఈ నాలుగు నెలల పాటు అంటే కార్తిక మాసం వరకు సృష్టి పాలనా బాధ్యతలు పరమశివుడి చేతిలోకి వెళ్తాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది దేవశయని ఏకాదశి జూలై 25న వస్తోంది. ఈ ప్రత్యేక రోజుతోనే హిందూ కేలండర్లో చాతుర్మాస దీక్షలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
అద్భుత గ్రహాల కలయిక.. ఈ సమయంలో నిషిద్ధమైన పనులు
ఈ ఏడాది దేవశయని ఏకాదశి నాడు ఆకాశంలో అరుదైన గ్రహాల కలయిక ఏర్పడుతోంది. జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, గురు గ్రహం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండగా, సూర్యుడు కూడా అదే కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మరోవైపు రాహువు కుంభ రాశిలో, శని మీన రాశిలో, శుక్రుడు-కేతువులు సింహ రాశిలో ఉన్నాయి.
బుధుడు తన స్వరాశి అయిన మిధున రాశిలో కొలువుదీరాడు. అయితే, ప్రస్తుతం గురుడు అస్తమించి ఉండటం వల్ల వివాహం వంటి మంగళకరమైన కార్యక్రమాలకు ముహుర్తాలు ఉండవు. ఈ చాతుర్మాస కాలం ముగిసి, కార్తిక మాసంలో వచ్చే దేవోత్థాన ఏకాదశి నాడే మళ్లీ గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. అప్పటి వరకు మరో నాలుగు నెలల పాటు శుభకార్యాలకు విరామం తప్పదు.
దేవశయని ఏకాదశి ప్రాముఖ్యత.. ఆచరించాల్సిన నియమాలు
సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే దివ్యమైన వ్రతంగా ఈ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పర్వదినాన శంఖు, చక్ర, గదాధరుడైన శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించాలి. నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించి, దీపారాధన చేసి, ప్లాశ్ ఆకుల్లో భోజనం చేయడం, రాత్రి సమయంలో నేలపై పడుకోవడం వంటి ఆచారాలను పెద్దలు పాటిస్తుంటారు. అలాగే, చాతుర్మాస నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలు, భాద్రపద మాసంలో పెరుగును పరిమితంగా తీసుకోవాలని చెబుతారు. ఈ నాలుగు నెలల కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, భగవన్నామ స్మరణలో గడిపితే శ్రీహరి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు.
రాజా బలి వద్ద శ్రీహరి నివాసం
పురాణాల ప్రకారం, ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ఒక రూపంలో రాజా బలి వద్ద ఉండగా, మరో రూపంలో క్షీరసాగరులో ఆదిశేషుడి పాన్పుపై శోభిస్తాడు. కార్తీక ఏకాదశి వరకు ఈ నిద్ర కొనసాగుతుంది. ఈ నాలుగు నెలల సమయాన్ని కేవలం భగవత్ చింతనకు, జప తపాలకు కేటాయించాలని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తున్నారు. ఈ కాలంలో కనీసం ఒక్క పూట భోజనం చేస్తూ నియమబద్ధంగా జీవిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


