మరణం తర్వాత చెవులు, ముక్కులో దూది ఎందుకు పెడతారు? వెనుక ఉన్న అసలు కారణాలివే!
హిందూ సంప్రదాయంలో జననం నుంచి మరణం వరకు మొత్తం 16 సంస్కారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వీటిలో అంతిమ సంస్కారాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక వ్యక్తి మరణించిన వెంటనే ముక్కు, చెవులు వంటి రంధ్రాల్లో దూదిని ఉంచడం మనం తరచుగా చూస్తుంటాం.
మనిషి పుట్టినప్పటి నుంచి మరణం దాకా మొత్తం 16 సంస్కారాలు ఉంటాయి. ఇందులో అంతిమ సంస్కారాలు అనేవి కీలకమైనవి. చనిపోయిన తర్వాత వ్యక్తి శరీరం నుంచి ప్రాణం వెళ్లిపోయాక వెంటనే వారి ముక్కు, చెవులలో దూదిని పెడతారు. అసలు ఎందుకు ఇలా చేయాలి? మరణం తర్వాత చెవుల్లో, ముక్కులో ఎందుకు దూది పెడతారు? దీని వెనక కారణాలు ఏంటో తెలుసుకుందాం.

గరుడ పురాణం, శాస్త్ర దృక్పథం ప్రకారం దీని వెనక పలు కారణాలు ఉన్నాయి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన శరీరం 9 ద్వారాలతో నిర్మితమై ఉంటుంది. రెండు కళ్ళు, రెండు నాసికా రంధ్రాలు, రెండు చెవులు, నోరు, మలమూత్ర విసర్జన అవయవాలు ఇలా మొత్తం తొమ్మిది ద్వారాలు ఉంటాయి. మరణ సమయంలో ఆత్మ ఈ ద్వారాలలో ఏదో ఒకదాని ద్వారా శరీరాన్ని వదిలి వెళ్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆచారాల వెనుక ముఖ్య ఉద్దేశాలు ఇవే:
ఆత్మ తిరిగి రాకుండా
చనిపోయిన వెంటనే ఆత్మకు శరీరంపై ఉన్న మమకారం పూర్తిగా పోదని నమ్మకం. అందుకనే ఆత్మ మళ్లీ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఈ ద్వారాలను దూదితో మూసివేస్తారు. ఇలా చేయడం వలన ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగించడానికి సహాయపడుతుందని విశ్వసిస్తారు.
బంగారం, తులసి రక్షణ
చనిపోయిన వారి నోట్లో తులసి దళాలను పెడతారు. కొంత మంది బంగారాన్ని కూడా ఉపయోగిస్తారు. బంగారం పవిత్రమైనదిగా, తులసి మోక్షాన్ని ప్రసాదించేదిగా భావిస్తారు. బంగారం లేదా తులసిని ఉంచడం వలన దోషాలు తొలగిపోతాయని, ఆ శరీరం పరలోక ప్రయాణానికి అర్హత పొందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ప్రతికూల శక్తుల నుంచి రక్షణ
చనిపోయాక శరీరం ప్రాణం లేని నిర్జీవ వస్తువుగా మారుతుంది. అలాంటప్పుడు ప్రతికూల శక్తులు, దుష్టశక్తులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని నమ్మకం. అందుకే దూదిని ఒక రక్షణ కవచంలా ఉపయోగిస్తారు. శరీరాన్ని అపవిత్రం కాకుండా దూది కాపాడుతుందని భావిస్తారు.
ఆరోగ్య భద్రత
ఆధ్యాత్మిక కారణాలతో పాటు దీని వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. చనిపోయిన కొద్దిసేపటికే శరీరంలో కుళ్లిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో శరీరంలోని కణాలు నశిస్తాయి. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వేగంగా అభివృద్ధి చెందుతాయి.
ముక్కు, చెవులు వంటి రంధ్రాలను దూదితో మూసివేస్తే శరీరంలోని ద్రవాలు బయటకు రావడం తగ్గుతుంది. దుర్వాసన, బ్యాక్టీరియా వ్యాప్తిని కొంత వరకు నియంత్రించడానికి ఇది సహాయ పడుతుంది. అలాగే, చనిపోయిన తర్వాత శరీరంలో వాయువుల ఉత్పత్తి కారణంగా ఒత్తిడి పెరిగి కొన్ని ద్రవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దూదిని ఉపయోగించడం వలన శరీరం శుభ్రంగా ఉండేలా చూసుకోవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


