...
...
Next Story

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు అలర్ట్ - జూలై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్..! త్వరలో యూనియన్ ఎన్నికలు

ఆర్టీసీ పురోగతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూలై 1 నుండి ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్‌మెంట్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

Published on: Jun 18, 2026, 14:28:19 IST
Advertisement

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు.

ఉన్నతస్థాయి సమీక్ష - పాల్గొన్న మంత్రి పొన్నం, అధికారులు
ఉన్నతస్థాయి సమీక్ష - పాల్గొన్న మంత్రి పొన్నం, అధికారులు

రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ నాగిరెడ్డితో పాటు పలువురు ఈడీలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యూనియన్ ఎన్నికలపై ప్రకటన..

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అధికారితో వెంటనే చర్చించి, గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శంకర్ కుటుంబానికి అండగా నిలుస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఉద్యోగుల నుండి సేకరించిన నిధులతో శంకర్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కుతో పాటు, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు అందించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

గడిచిన 30 నెలల కాలంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ బలోపేతానికి భారీగా నిధులు కేటాయించిందని మంత్రి వివరించారు. 2023-26 మధ్యకాలంలో రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 నూతన బస్సులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఏటూరు నాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలను మంజూరు చేశామని, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్ స్టేషన్లను ఆధునీకరించాలని మంత్రి ఆదేశించారు. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి బస్ డిపో పనులను వేగవంతం చేయాలని, ములుగు బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. రాబోయే వారం రోజుల్లో వేములవాడ, కథలాపూర్ బస్ స్టేషన్‌లకు శంకుస్థాపనలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మునుగోడు, చండూరు, మర్రిగూడ బస్ స్టేషన్‌ల పునరుద్ధరణ పనులతో పాటు నాంపల్లి బస్ స్టేషన్ స్థల పరిశీలనపై చర్చించారు.

మధిర బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని, మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా బస్ స్టేషన్‌కు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. హుజూర్‌నగర్, కోదాడ, నాగర్‌కర్నూల్ బస్ స్టేషన్‌లకు కూడా త్వరలోనే శంకుస్థాపనలు ఉంటాయన్నారు. మంచిర్యాల, చెన్నూరు, మెదక్, బెల్లంపల్లి, పరకాల, ములకనూరు, ధర్మపురి, మక్తల్ బస్ స్టేషన్లను అధికారులు స్వయంగా సందర్శించి రెనోవేషన్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మహాలక్ష్మి పథకం, ఎలక్ట్రిక్ బస్సులు

మహిళల ఉచిత ప్రయాణ పథకం (మహాలక్ష్మి) వారి ఆర్థిక సాధికారతపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేసి ఫీడ్‌బ్యాక్ నమోదు చేయాలని అధికారులను కోరారు. మహిళా సంఘాలను 553 బస్సులకు యజమానులను చేసి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుపుతున్నందున, వారి అభిప్రాయాలను కూడా సేకరించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, వాటి లాభనష్టాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks