గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్ - హైదరాబాద్లో ఉచితంగా విశ్రాంతి గదులు!
హైదరాబాద్లో గిగ్ కార్మికులు, డెలివరీ భాగస్వాముల కోసం 5 కొత్త 'అశ్రయ్' విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అమెజాన్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి.
హైదరాబాద్ మహా నగరంలో రేయింబగళ్లు కష్టపడుతూ, ఈ-కామర్స్ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న డెలివరీ బాయ్స్ (గిగ్ కార్మికుల) సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా చేతులు కలిపాయి. భాగ్యనగరంలో అత్యధికంగా జనాలు తిరిగే….. రద్దీగా ఉండే ఐదు ప్రధాన ప్రాంతాల్లో అత్యాధునిక 'అశ్రయ్' (విశ్రాంతి) కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సోమవారం ఇరు వర్గాలు ఒక అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశాయి.

నగరంలో విశ్రాంతి కేంద్రాలు….
ఈ ఒప్పందం ప్రకారం, సదరు విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించడం, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులను వేగవంతం చేయడం మరియు పరిపాలనాపరమైన సమన్వయాన్ని అందించడంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కీలక పాత్ర పోషిస్తుంది. నగరంలో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో కష్టపడే కార్మికులకు అండగా నిలవాలనే ఉమ్మడి లక్ష్యంతోనే ఈ భాగస్వామ్యం కుదిరిందని అధికారులు వెల్లడించారు.
కొండాపూర్, తెల్లాపూర్, పటాన్చెరు, భారతీ నగర్, చందానగర్ వంటి కీలక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 2024లో ప్రారంభమైన ఈ 'అశ్రయ్' ప్రాజెక్ట్ ద్వారా….. ఏ కంపెనీకి చెందిన డెలివరీ డ్రైవర్ అయినా సరే, ఉచితంగా ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్పై తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడారు. "తెలంగాణలో పనిచేస్తున్న డెలివరీ డ్రైవర్ల పని వాతావరణాన్ని…. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అమెజాన్ ఇండియాతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది," అని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
అమెజాన్ ఇండియా కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా…. దేశవ్యాప్తంగా తన సామాజిక బాధ్యతను విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో ఈ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలలో డెలివరీ బాయ్స్ కోసం ఎయిర్ కండిషనింగ్ (AC), స్వచ్ఛమైన తాగునీరు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఉచిత వైఫై మరియు వాష్రూమ్ వంటి సదుపాయాలను ఉచితంగా కల్పిస్తారు.
ఈ వ్యూహాత్మక విస్తరణ గురించి అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సలీమ్ మేమన్ పూర్తి వివరాలను పంచుకున్నారు. "దేశవ్యాప్తంగా మా నెట్వర్క్ను 250 కేంద్రాలకు విస్తరిస్తున్న తరుణంలో, చివరి మైలు వరకు (లాస్ట్-మైల్) డెలివరీలను సకాలంలో అందిస్తూ వ్యవస్థను నడిపిస్తున్న ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం మేము నిరంతరం పెట్టుబడులు పెడుతున్నాం. మా ఆపరేషన్స్ నెట్వర్క్లో అసోసియేట్ల భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి మేము కేటాయించిన రూ. 2,800 కోట్ల భారీ పెట్టుబడిలో ఈ ప్రాజెక్ట్ కూడా ఒక భాగం" అని సలీమ్ మేమన్ వివరించారు.
ఈ నిర్ణయం వల్ల ఎండనక, వాననక రోడ్లపై తిరిగే వేలాది మంది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ మరియు అమెజాన్ డెలివరీ భాగస్వాములకు ఎంతో ఉపశమనం కలగనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

