Analogue Paneer Ban : తెలంగాణలో అనలాగ్ పనీర్పై నిషేధం - ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్, నాన్ డెయిరీ, ఆర్టిఫిషియల్ పనీర్పై నిషేధం విధించింది. ఏడాది కాలం పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.
నకిలీ, కృత్రిమ, నాన్-డైరీ ఉత్పత్తులతో తయారుచేసే 'అనలాగ్ పనీర్' (Analogue Paneer) పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అనలాగ్ పనీర్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ప్రకటన విడుదల చేసింది. ఈ నిషేధం 2026 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి… ఒక ఏడాది పాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

'అనలాగ్ పనీర్' ఏంటి…?
సాధారణంగా మనం వాడే సాంప్రదాయ పనీర్ పాల ఉత్పత్తులతో తయారవుతుంది. కానీ 'అనలాగ్ పనీర్' అనేది పాలకు బదులుగా నాన్-డైరీ పదార్థాలు, కూరగాయల నూనెలు, స్టార్చ్, ఇతర రసాయనాలను ఉపయోగించి తయారుచేసే కృత్రిమ ప్రత్యామ్నాయం. చూడటానికి, పట్టుకుని చూడటానికి ఇది గట్టిదనంలోనూ, రూపంలోనూ సరిగ్గా అసలు పనీర్లాగే కనిపిస్తుంది.
మార్కెట్లో పనీర్ పేరిట విక్రయిస్తున్న ఈ ఉత్పత్తులలో అసలు పనీర్లో ఉండే పోషక విలువలు ఉండవనేది ప్రధాన ఆందోళన. ముఖ్యంగా శాఖాహారులు తమ దైనందిన ఆహారంలో ప్రొటీన్ (మాంసకృత్తులు) కోసం పనీర్పై ఎక్కువగా ఆధారపడతారు. కానీ అనలాగ్ పనీర్ తిన్నప్పుడు శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్రొటీన్ లభించదు. అయితే….. నాన్-డైరీ ఉత్పత్తి అయినంత మాత్రాన అదంతా నేరుగా విషపూరితం అని చెప్పలేము గానీ, అందులో వాడే పదార్థాల నాణ్యత, మోతాదు, తయారీ విధానంపైనే దాని ఆరోగ్య ప్రభావం ఆధారపడి ఉంటుంది.
సాధారణ డెయిరీ పనీర్తో పోలిస్తే…. అనలాగ్ పనీర్లో పోషకాల నిష్పత్తి పూర్తిగా వేరుగా ఉంటుంది. తయారీదారులు ఉపయోగించే ఫార్ములాను బట్టి ఇందులో ప్రొటీన్, కొవ్వు పదార్థాలు మారుతుంటాయి.
ఈ కృత్రిమ పనీర్ తయారీలో ప్రాసెస్ చేసిన వెజిటబుల్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులను విచ్చలవిడిగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి కొవ్వులు ఎక్కువగా ఉన్న పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో నిషిద్ధమైన LDL (చెడు) కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగి, గుండె జబ్బులు మరియు ఇతర ప్రాణాంతక కార్డియోవాస్క్యులర్ సమస్యలు వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా, సరైన పరిశుభ్రత పాటించకుండా, నాసిరకం పదార్థాలతో, కల్తీ పద్ధతుల్లో తయారుచేసే అనలాగ్ పనీర్ వల్ల తీవ్రమైన కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి జీర్ణకోశ వ్యాధులు తలెత్తుతాయి. పాకెట్లపై సరైన సమాచారం ఇవ్వకుండా ప్రజలను మోసం చేయడం కూడా దీనివల్ల జరుగుతోంది.
ప్రభుత్వం విధించిన ఈ నిషేధం కేవలం దుకాణాల్లో అమ్మకాలకే పరిమితం కాలేదు. సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ఇది కవర్ చేస్తుంది. అనలాగ్ పనీర్ తయారీ, దాని ప్రాసెసింగ్, ప్యాకింగ్, గోదాముల్లో నిల్వ చేయడం, రవాణా మరియు పంపిణీ చేయడాన్ని పూర్తిగా నేరంగా పరిగణిస్తారు.
మీరు కొనుగోలు చేస్తున్న పనీర్ నిజమైన డెయిరీ పనీరా లేక ప్రత్యామ్నాయ కల్తీ పనీరా అనేది పరిశీలించుకోవడం అత్యవసరం. ప్యాకెట్లపై ఉండే పదార్థాల జాబితా (Ingredients) ను క్షుణ్ణంగా చదివి, గుర్తింపు పొందిన బ్రాండ్లు, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించే సంస్థల ఉత్పత్తులనే ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

