Hyderabad Crime : కిటికీలో నుంచి నర్సు గదిలోకి దూకిన బిహార్ వ్యక్తి.. ఆపై దారుణం!
Hyderabad Crime : హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సు మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్ వ్యక్తి.. నర్సుపై అత్యాచారయత్నం చేస్తూ.. చంపేశాడు.
హైదరాబాద్ నగర పరిధిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సు (21) అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మొదట దీనిని అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది కేవలం మరణం కాదని, అత్యాచార యత్నాన్ని అడ్డుకునే క్రమంలో జరిగిన హత్య అని అధికారులు నిర్ధారించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి తన కాళ్లపై తాను నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉండాలనే సంకల్పంతో ఏడు నెలల క్రితం హైదరాబాద్కు వచ్చింది. మహేశ్వరంలోని బంధువుల ఇంట్లో ఉండేది. ఆ తర్వాత ఒక స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో చేరింది. ఆసుపత్రి యాజమాన్యం కేటాయించిన గదిలోనే ఉంటూ రోజువారీ విధులు నిర్వర్తించేది.
శనివారం మధ్యాహ్నం తన గదికి వెళ్లిన ఆ యువతి ఎంతకీ తిరిగొచ్చి విధుల్లో చేరకపోవడంతో ఆసుపత్రి వర్గాలు ఆందోళన చెందాయి. ఫోన్ చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో సిబ్బందిని ఆమె గదికి పంపించారు. లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉండటం, అనుమానం వచ్చి కిటికీ గుండా చూడగా ఆమె నేలపై స్పృహతప్పి పడివుండటం గమనించారు. వెంటనే తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లగా, అప్పటికే ఆ యువతి ప్రాణాలు అనంత వాయువుల్లో కలసిపోయాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పహాడీషరీఫ్ పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. బాధితురాలి శరీరంపై గాయాల గుర్తులు ఉండటంతో, బంధువుల ఫిర్యాదు మేరకు హత్యాకోణంలో విచారణ చేపట్టారు. సమీప పరిసరాల్లో సీసీటీవీ ఫుటేజ్, విశ్లేషించిన పోలీసులు బిహార్కు చెందిన సైనా ఉల్లా అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు. అతను ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా, తనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడు సైనా ఉల్లా.. మధ్యాహ్నం వేళ నర్సు ఒంటరిగా ఉందనే విషయాన్ని గమనించి, కిటికీ మార్గం ద్వారా గదిలోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించగా బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె వేసే కేకలు బయటకు రాకుండా గొంతును గట్టిగా నొక్కిపెట్టడంతో ఊపిరాడక ఆ యువ నర్సు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
నమ్మకంతో నగరానికి పంపిన తమ కుమార్తె దారుణంగా హత్యకు గురైందని తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, బీజేపీ స్థానిక నాయకులు, బాధితురాలి బంధువులతో కలిసి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


