సాగునీటి కోసం మరో యుద్ధం... లక్షలాది మందితో త్వరలో కార్యాచరణ - కేసీఆర్

సాగునీటి సరఫరాలో కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా విడుదల చేయకపోవడంపై లక్షలాది మందితో క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

Published on: Sep 7, 2026, 06:55:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో సాగునీరు, తాగునీటి సరఫరా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం లక్షలాది మంది రైతులు, కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో మరో జల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్…

ఆదివారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం (BRSLP) సంయుక్త సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నీటిని ఎత్తిపోయడం లేదని కేసీఆర్ ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద చిన్నపాటి మరమ్మతులు చేస్తే దాదాపు 13 జిల్లాల రైతాంగానికి సాగునీరు అందుతుందని… కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రాజెక్టును పక్కన పెట్టిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగానికి విడుదల చేయకుండా, పక్క రాష్ట్రం వాడుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై ఇదే రకమైన అలసత్వం వహిస్తే తానే స్వయంగా లక్షలాది మందితో ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తానని హెచ్చరించారు.

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడుదల, పాలిటెక్నిక్ విద్యపై తెచ్చిన జీవో 97 ప్రభావం, గురుకులాల్లో వసతుల లేమి వల్ల జరుగుతున్న విద్యార్థుల మరణాలపై సభలో గళమెత్తాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల అత్యవసర సమయాల్లో భూములు అమ్ముకోలేక పేద, మధ్యతరగతి ప్రజలు పడుతున్న గోసను నిలదీయాలని చెప్పారు. జాబ్ క్యాలెండర్ విడుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

మిషన్ భగీరథ నిర్వహణ లోపాలు, కరెంట్ సరఫరాలో కోతలు, వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే నిర్ణయాలను ఎండగట్టాలని సూచించారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేయడం, సింగరేణిలో అవినీతి, మెట్రో నిర్వహణ భారాన్ని ప్రభుత్వంపై వేయడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ నిధుల విడుదల అంశాలపై ప్రభుత్వాన్ని పట్టుబట్టాలని స్పష్టం చేశారు.

అసెంబ్లీని ప్రజా సమస్యల చర్చా వేదికగా కాకుండా వ్యక్తిగత విమర్శలకు నిలయంగా మార్చుతున్న అప్రజాస్వామిక విధానాన్ని ఉభయ సభల్లో తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More