Amazon Data Centre : ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
Amazon Data Centre Hyderabad : హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2034 నాటికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్ను కోరారు.
Amazon Data Centre in Bharat Future City: హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో మరో ముందడుగు పడింది. ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థ అమెజాన్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పదేళ్లలో…. అంటే 2034 నాటికి అమెజాన్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.1 లక్ష కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
“భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే ఫార్చూన్ 500 కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 108 దేశాలకు చెందిన ప్రతినిధులు, 3 వేలకు పైగా కార్పొరేట్ దిగ్గజాలను ఆహ్వానించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఇక్కడ నిర్వహించాం.
2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదగాలన్నది మా కల. మా లక్ష్యం. దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ ప్రస్తుతం దేశ జీడీపీకి 5 శాతం మేరకు తోడ్పాటును అందిస్తోందని, 2047 నాటికి 10 శాతం మేరకు అందించాలన్నది మా లక్ష్యం.
లక్ష్యం నెరవేరాలంటే అందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగావకాశాల కల్పన అవసరం. ఆ దిశగా లక్ష్యాలను నిర్దేశించుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించాం. ఈ విజన్ రూపకల్పనలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు - సీఎం
“పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడానికి సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నాం. 2025 డిసెంబర్లో రూపొందించిన పాలసీ మేరకు ఇప్పుడు అమెజాన్కు భూమి కేటాయించి ప్రభుత్వం చెప్పింది చేస్తుంది. 2034 లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రయాణం మొదలైంది. వచ్చే 14 ఏండ్లలో 7 బిలియన్ డాలర్లను అమెజాన్ పెట్టుబడులు పెడుతోంది. ప్రభుత్వ సంకల్పం నెరవేరే దిశగా 1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలి. అందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా అమెజాన్కు సహకరిస్తుంది. ఏది కావాలన్నా సమకూర్చుతాం. పెట్టుబడులపై ప్రతి నెలా సమీక్షిస్తాను” అని సీఎం హామీ ఇచ్చారు.
“ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత పాలసీలో పెరాలసిస్ రాకూడదు. అందుకే పెట్టుబడుల కోసం స్పష్టమైన పాలసీలు తెచ్చాం. టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ పాలసీలు తెచ్చాం. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోనే ఈ పాలసీలు తెచ్చాం. మా లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు, యంత్రాంగం కార్యోన్ముఖులై పనిచేస్తున్నారు. అమెజాన్ డేటా సెంటర్ తొలి మెట్టుగా పనిచేస్తుంది” అని చెప్పారు.
“తెలంగాణ విజన్ మేరకు రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాం. ఓఆర్ఆర్ లోపలి భాగం హైదరాబాద్ మహానగరంలో 1.34 కోట్ల జనాభా జీనవ స్థితిగతులను మెరుగుపరచడానికి, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను బయటి ప్రాంతానికి తరలిస్తున్నాం. మూసీ నది ప్రక్షాళన చేపట్టాం. కాలుష్యాన్ని తగ్గించడానికి డీజిల్ ఇంధనంతో నడిచే 3 వేల ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చుతున్నాం. నగరంలో డీజిల్తో నడుస్తున్న 2 లక్షల ఆటోలను రెట్రోఫిట్టింగ్ ద్వారా మార్చడమే కాకుండా ఈవీలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వానికి ఏటా రూ. 1500 కోట్లు ఆదాయం కోల్పోతున్నప్పటికీ ఈవీలకు జీరో టాక్స్ అమలు చేస్తున్నాం" అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
కాలుష్యం, వరదల వంటి ఢిల్లీ, ముంబయ్, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కు అలాంటి దుస్థితి రాకూడదని ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్గా, ఓఆర్ఆర్ అవతలి ప్రాంతం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం పెరి అర్బన్ ఏరియాలో మాన్యుఫాక్చరింగ్ జోన్గా నిర్దేశించామని పేర్కొన్నారు.
“ఈ ప్రాంతంలో అవసరాలకు తగినట్టుగా విద్యుత్, నీరు, భూమి, సాంకేతిక నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేస్తే చైనాతో పోటీ పడటానికి వీలుగా మారుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు బయటి ప్రాంతం రూరల్ అగ్రికల్చర్ ఎకానమీని వృద్ధి చేయాలని సంకల్పించాం. ఇది మా విజన్. మా కమిట్మెంట్. మా డ్రీమ్. మా విజన్ సాధనలో రైతుల త్యాగం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్న రైతులకు మరింత నష్టపరిహారాన్ని పెంచి గౌరవించాలి. వారికి మరింత భరోసా, వారిలో విశ్వాసం కల్పించాల్సి ఉంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

