...
...
Next Story

ఇవేం చలి గాలులు బాబోయ్.. ఈ రాత్రి నుంచి 4 రోజులు చలితో ఆగం ఆగం!

తెలంగాణలో శీతల గాలులు మరో నాలుగు రోజులు ఉండనున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లోనూ 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published on: Dec 18, 2025, 11:12:41 IST
Advertisement

తెలంగాణలో చలిగాలులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి, అనేక ప్రాంతాల్లో సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ శివార్లు గడ్డకట్టే స్థాయికి దగ్గరగా పడిపోయాయి. ఉత్తర తెలంగాణ అత్యంత శీతల ప్రాంతంగా మారింది. డిసెంబర్ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శీతల గాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలిపింది.

తెలంగాణలో చలి గాలులు
తెలంగాణలో చలి గాలులు

హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్‌లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 7.5 డిగ్రీలు. ఇది చలిగాలుల తీవ్రత, హైదరాబాద్‌పై ప్రభావాన్ని తెలియజేస్తుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలలో కూడా డిసెంబర్ మధ్యలో అసాధారణంగా చలి పరిస్థితులు నెలకొన్నాయి.

జీహెచ్ఎంసీ పరిమితుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు, 13 డిగ్రీల మధ్య ఉన్నాయి. సెర్లింగంపల్లిలో 8.1 డిగ్రీలు, మౌలా అలీలో 9.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.5 డిగ్రీలు నమోదయ్యాయి. గచ్చిబౌలి, వెస్ట్ మారేడ్‌పల్లి వంటి కీలకమైన ఐటీ, నివాస కేంద్రాలలో 11 డిగ్రీలు, చార్మినార్, ఎల్బీ స్టేడియంలో 12.9డిగ్రీలు నమోదయ్యాయి. మల్కాజ్‌గిరిలో 13.1 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది.

తెలంగాణ వ్యాప్తంగా ఆసిఫాబాద్ అత్యంత శీతల ప్రదేశంగా ఉంది. ఇక్కడ 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. తరువాత సంగారెడ్డి (6.4 డిగ్రీలు), రంగారెడ్డి (6.5 డిగ్రీలు) ఉన్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఇతర జిల్లాలు ఆదిలాబాద్ (7.7 డిగ్రీలు), వికారాబాద్, సిద్దిపేట (8.1 డిగ్రీలు), మెదక్ (8.5డిగ్రీలు), కామారెడ్డి (8.6డిగ్రీలు), నిజామాబాద్ (9.1 డిగ్రీల).

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా చలి తీవ్రత ఉంది. 15 రోజుల నుంచి సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితమయ్యాయి. కోహీర్ ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం కోహీర్‌లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe