తెలుగు రాష్ట్రాల్లో తగ్గనున్న కనిష్ట ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు చలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. ఇప్పటికే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
తెలంగాణ తీవ్రమైన చలిగాలులను ఎదుర్కొంటోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 మూడు డిగ్రీల వరకు పడిపోతున్నాయి. డిసెంబర్ 16 వరకు చలి కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరిస్తోంది, అయితే ఇండిపెండెంట్ వెదర్ ట్రాకర్ అంచనా ప్రకారం డిసెంబర్ 21 వరకు చలి కొనసాగవచ్చు. రాబోయే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది.

రాబోయే ఏడు రోజులలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ కార్యాలయం పేర్కొంది. గత 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతలగాలుల నమోదయ్యాయి. ఆదివారం, సోమవారం మధ్య రాత్రి ఆదిలాబాద్లో అత్యల్పంగా 7.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని నివేదికలో తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో చలి విపరీతంగా ఉంది. వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో చలి అధికంగా నమోదు అవుతుంది. సోమ, మంగళవారాల్లో 12 జిల్లాల్లో 8 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.
'తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని విడిగా ఉన్న ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉంది.' అని ఐఎండీ-హైదరాబాద్ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ చలి ఎక్కువే ఉంటుంది.
హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య కొనసాగుతాయని IMD హైదరాబాద్ తెలిపింది. డిసెంబర్ 16 నుంచి 18 మధ్య ఉష్ణోగ్రతలు చాలా చల్లగా ఉంటాయని, డిసెంబర్ 19, 2025న మరో శక్తివంతమైన శీతలగాలులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఏపీలో చలి
ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. అరకులో ఇప్పటివరకు కనిష్ట ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇతర ఏజెన్సీ ప్రాంతాలలో కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచు వాహనదారులకు ఇబ్బందులను కలిగిస్తోంది. మన్యంలో విపరీతమైన చలి ఉంది. జనాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కోస్తాంధ్రాలో సోమ, మంగళవారాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది.














