Bandi Bhagirath POCSO Case : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. నిందితుడు ఏ క్షణమైనా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, రేవులను అప్రమత్తం చేస్తూ లుకౌట్ సర్క్యులర్ (LOC) నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్పై ఇప్పటికే అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో…. అతనిని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.
రంగంలోకి ప్రత్యేక బృందాలు…

బండి భగీరథ్ జాడ కనిపెట్టేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు సాంకేతిక ఆధారాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వేర్వేరు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. నిందితుడితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్న వ్యక్తులు, అతని ఆత్మీయ స్నేహితులు మరియు కుటుంబ బంధువుల ఇళ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఎవరి వద్దనైనా ఆశ్రయం పొందుతున్నాడా అనే కోణంలోనూ సోదాలు సాగుతున్నాయి.
గాలింపు చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారిక నివాసానికి శనివారం ఒక ప్రత్యేక పోలీస్ బృందం చేరుకుంది. అక్కడ భగీరథ్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుండటంతో చట్టపరమైన చర్యలు అత్యంత పారదర్శకంగా, వేగంగా తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు.