...
...
Next Story

CPI Maoist Ban Lift : "నిషేధం" ఎత్తివేతపై ఫోకస్ - మాజీ మావోయిస్టు అగ్రనేతల ప్రయత్నాలు

సీపీఐ (మావోయిస్టు) పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ లొంగిపోయిన అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ కోరారు. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తామన్నారు.

Published on: Aug 16, 2026, 15:21:12 IST
Advertisement

సీపీఐ (మావోయిస్టు) పార్టీపై నిషేధాన్ని ఎత్తివేయాలని మాజీ మావోయిస్ట్ అగ్రనేతలు కోరుతున్నారు. ఇదే విషయంపై తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ.. తన సహచర నేతలతో కలిసి చర్చలు జరుపుతున్నారు. కలిసివచ్చే మాజీ సహచరులతో కలసి ప్రజల సమస్యలపై చట్టబద్ధంగా, బహిరంగంగా పనిచేయడానికి వీలుగా సీపీఐ (మావోయిస్టు) పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి పంపాలని భావిస్తున్నారు.

డీజీపీతోనూ చర్చలు…

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేతలు ఇటీవల తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి తమ వినతులను సమర్పించారు. చనిపోయిన తమ పాత సహచరుల కుటుంబాలను పరామర్శించడం, చిన్న తరహా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురుకాకుండా చూడాలని కోరారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ, రహస్య లేదా సాయుధ కార్యకలాపాలకు పాల్పడబోమని, అయితే తమపై అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉన్నందున ముందస్తుగా పోలీసు యంత్రాంగానికి స్పష్టతనిచ్చామని దేవ్‌జీ పేర్కొన్నారు.

"ప్రజా సమస్యలపై పనిచేసే ఏ వేదికైనా రాజకీయ పార్టీయే అవుతుంది. నిషేధం ఎత్తివేస్తే ఇప్పటికే ఉనికిలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) పార్టీ పతాకం కిందే బహిరంగంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని దేవ్‌జీ స్పష్టం చేశారు.

కేంద్రానికి దరఖాస్తు…

లొంగిపోయిన నాయకులు ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయడానికి వీలుగా పార్టీపై నిషేధం తొలగించాలని కేంద్రానికి దరఖాస్తు పంపే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. డీజీపీని కలిసిన సందర్భంగా ఆయన నుంచి సానుకూల స్పందన లభించిందని, తాము చేపట్టబోయే కార్యాచరణ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని సాధారణ రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా, కేవలం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉంటుందని వివరించారు.

ప్రధానంగా ఆరోగ్య సమస్యల కారణంగానే అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసినట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. "ఆరోగ్య దృష్ట్యా అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పాను. నా సిద్ధాంత భావజాలానికి కట్టుబడి, చట్టబద్ధమైన చట్రంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై నా పోరాటం కొనసాగిస్తాను" అని ఆ సమయంలో తేల్చిచెప్పారు.

మాజీ సభ్యులు ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు నిషేధిత సంస్థ పేరును ఎలా ఉపయోగిస్తారనే అంశంపై ఒక సీనియర్ తెలంగాణ పోలీసు అధికారి స్పందించారు. చట్టబద్ధమైన పరిధికి లోబడి ఎవరైనా తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe