పారిశుధ్య ప్రమాణాలను మెరుగుపరచడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) జపాన్ తరహా వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తోంది. చెత్తను ఉపయోగపడే వనరులుగా మార్చే సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఒక ప్రతిపాదనను రూపొందించారు. రంగారెడ్డి జిల్లాలోని సిద్ధాపూర్లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC) భూమిలో 86 ఎకరాల ఎకో-టౌన్ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఉంది. భూమి కేటాయింపు పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ-ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్లో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. వ్యర్థాలు బయటకు పోకుండా నిరోధించడానికి మొత్తం ఎకోటౌన్ ప్రాంతాన్ని కంటైనర్ తరహాలో నిర్మాణం చేస్తారు. తడి వ్యర్థాలను కంపోస్ట్గా మారుస్తారు, పొడి వ్యర్థాలను రీసైకిల్ చేస్తారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా ఉంటుంది. ఈ వ్యవస్థ రోజువారీ వ్యర్థాల ప్రాసెసింగ్ను చేస్తుంది. అంతేకాదు దుమ్ము, దుర్వాసన, నివారిస్తుందని అధికారులు తెలిపారు. వ్యర్థాలు సంపదగా మారుతాయి.
సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలంలో జీహెచ్ఎంసీ 18 నెలల క్రితం వ్యర్థాల నిర్వహణ కేంద్రంపై పనిని ప్రారంభించింది. భూమి విలువ తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమీపంలోని భూ యజమానులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు పెండింగ్లో ఉంది. మార్చి 6న తుది వాదనలు ఉండే అవకాశం ఉంది.
ఈ ప్లాంట్లో ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని అధికారులు అంటున్నారు. దుర్వాసన, వాయు కాలుష్యం లేదా మురుగునీటి ప్రవాహ సమస్యలను కలిగించదని చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ దుండిగల్లో 85 ఎకరాలు, స్పాల్నగర్లో 17 ఎకరాలను అదనపు వ్యర్థాల నిర్వహణ సౌకర్యాల కోసం గుర్తించింది. అయితే దుండిగల్ స్థలం కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) నుండి ఆమోదం పెండింగ్లో ఉంది. ఎందుకంటే ఎంపిక చేసిన భూమి ఔటర్ రింగ్ రోడ్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ప్రస్తుత నిబంధనలు ఈ ప్రాంతంలో అటువంటి సౌకర్యాలను పరిమితం చేస్తాయి. అయితే దీనిపై మినహాయింపు కోరుతూ జీహెచ్ఎంసీ మే 2025లో HMDAకి లేఖ రాసింది. అయితే దీనిపై స్పందన రావాల్సి ఉంది. ఈ కేంద్రాలన్నీ పనిచేయడం ప్రారంభించిన తర్వాత జవహర్నగర్ డంపింగ్ యార్డ్పై భారం తగ్గే అవకాశం ఉంది.