గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావాలి.. తెరపైకి కొత్త డిమాండ్
హైదరాబాద్ నగరాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రణాళికలు నడుస్తున్నాయి. తాజాగా తెరపైకి మరో కొత్త డిమాండ్ వచ్చింది. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిమితులను ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు విస్తరించి. పరిపాలనను మూడు విభాగాలుగా విభజించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ పేరుతో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించాలనే ప్రతిపాదన సికింద్రాబాద్ నివాసితులు, రాజకీయ నాయకుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్, జిల్లా ఏర్పాటు చేయాలనే వాదనలు వస్తున్నాయి.
భారత రాష్ట్ర సమితి నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రత్యేక సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ లేకుండా హైదరాబాద్ను ఊహించలేమని అంటున్నారు. సికింద్రాబాద్ 220 సంవత్సరాలకుపైగా చరిత్ర, సైనిక కంటోన్మెంట్, వాణిజ్య ప్రాముఖ్యత, ప్రధాన రైల్వే జంక్షన్, క్లాక్ టవర్, లష్కర్ ప్రాంతం వంటి విషయాలను ప్రస్తావిస్తున్నారు. సికింద్రాబాద్ పేరు లేకుండా దానిని ఇతర కార్పొరేషన్లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ డిమాండ్ను సాధించడానికి దశలవారీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ విషయంపై ఒత్తిడి తీసుకురావడానికి సికింద్రాబాద్లోని అందరితో మాట్లాడుతామని చెప్పారు. ప్రతిపాదిత మూడు కార్పొరేషన్లలో ఒకదానికి సికింద్రాబాద్ అని పేరు పెట్టవచ్చని లేదా ప్రత్యేక సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ విషయం నగరంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.
- 1806: సికింద్రాబాద్ బ్రిటిష్ సైనిక కంటోన్మెంట్గా స్థాపించారు. తరువాత వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.
- 1850–1900: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్థాపనతో రైల్వే కేంద్రంగా ఆవిర్భవించింది.
- 1948–1955: హైదరాబాద్ విలీనం తర్వాత కూడా ప్రత్యేక పౌర గుర్తింపును నిలుపుకొంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది.
- 1955: హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు విలీనమై మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్) ఏర్పడింది.
- 2007: 12 మున్సిపాలిటీల విలీనంతో ఎంసీహెచ్.. జీహెచ్ఎంసీగా విస్తరించింది; సికింద్రాబాద్ పేరున్న జోన్గా కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న డేటా ప్రకారం.. హైదరాబాద్ కార్పొరేషన్: సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, జనాభా సుమారు 45 లక్షలుగా ఉంది. సైబరాబాద్: సుమారు 850 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, జనాభా సుమారు 50 లక్షలు, మల్కాజ్గిరి: సుమారు 553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, జనాభా సుమారు 39 లక్షలుగా ఉంది. మూడు కార్పొరేషన్లుగా పరిపాలనా వికేంద్రీకరణను సమర్థించడానికి ఈ గణాంకాలను ఉదహరించారు.
ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10న ముగుస్తుంది. ఆ సమయానికి స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతియాత్ర చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


