...
...
Next Story

'శివుడి చెంతనే అరుణ్ తివారీ'.. భౌతికకాయాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని కుటుంబం నిర్ణయం!

కిందటి వారం పర్వతారోహణ ముగించుకొని తిరిగివస్తుండగా.. ఎవరెస్ట్‌పై హైదరాబాద్‌కు చెందిన అరుణ్ కుమార్ తివారీ మరణించారు. ఆయన మృతదేహాన్ని ఎవరెస్ట్‌పైనే వదిలేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

Published on: May 27, 2026, 20:23:38 IST
Advertisement

'ఆయన ఇప్పుడు ఆ పరమశివుడి పాదాల చెంత, ఆ కైలాసంలోనే ఉండిపోయారు.. ఆయన ఆత్మకు అదే ప్రశాంతతనిస్తుంది..." ఎవరెస్ట్ పర్వాతారోహణ ముగించుకుని, తిరుగుప్రయాణంలో వస్తుండగా కన్నుమూసిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ (53) కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు ఇవి. అరుణ్ కుటుంబ సభ్యులు అత్యంత భారమైన హృదయంతో తీసుకున్న నిర్ణయం ఇది. ప్రమాదకరమైన పరిస్థితుల నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని ఎవరెస్ట్ పర్వతంపైనే వదిలివేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.

అరుణ్ కుమార్ తివారీ
అరుణ్ కుమార్ తివారీ

తెలంగాణకు చెందిన అరుణ్ కుమార్ తివారీ ఒక ఐటీ ప్రొఫెషనల్. పర్వతారోహణపై ఉన్న మక్కువతో గత వారం ఆయన ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అయితే, సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. శిఖరం నుంచి కిందకు దిగుతుండగా 'హిల్లరీ స్టెప్' అనే ప్రమాదకరమైన ప్రాంతంలో ఆయన అస్వస్థతకు గురై మరణించారు.

"ఆయన శివుడి ఆవాసంలోనే ఉన్నారు.."

అరుణ్ కుమార్ తివారీ మరణంపై ఆయన బావ సుధీర్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. కుటుంబం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న మానవీయ, ఆధ్యాత్మిక కోణాన్ని పంచుకున్నారు. "ఎవరెస్ట్ పర్వతాన్ని మేం పరమశివుని నివాసంగా భావిస్తాం. అరుణ్ ఇప్పుడు ఆ దేవుడి చెంతనే ఉన్నారు. అంత ఎత్తు నుండి భౌతికకాయాన్ని కిందకు తీసుకురావాలంటే శరీరం పూర్తిగా దెబ్బతింటుంది. పైగా అక్కడ వాతావరణం చాలా ప్రమాదకరం. కేవలం డబ్బుల గురించో, ఖర్చుల గురించో మేము ఈ నిర్ణయం తీసుకోలేదు. హిమాలయాలతో ఎంతో అనుబంధం ఉన్న ఒక పర్వతారోహకుడిగా ఆయన ఆత్మ కూడా అక్కడే ప్రశాంతంగా విశ్రమించాలని కోరుకుంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం.' అని సుధీర్ చెప్పారు.

కల కోసం రెండోసారి వెళ్లి

ఇదే ఎవరెస్ట్ యాత్రలో అమెరికాకు చెందిన సందీప్ అరే అనే మరో పర్వతారోహకుడు కూడా స్నో బ్లైండ్‌నెస్ కారణంగా తీవ్ర అలసట కారణంగా మరణించారు. అయితే ఆయన క్యాంప్-3 వద్ద మరణించడంతో మృతదేహాన్ని క్యాంప్-2 కి తీసుకువచ్చి, హెలికాప్టర్ ద్వారా తరలించగలిగారు.

డెత్ జోన్

సముద్ర మట్టానికి 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాన్ని ‘డెత్ జోన్’ అంటారు. ఇక్కడ ఆక్సిజన్ స్థాయిలు ఎంత తక్కువగా ఉంటాయంటే.. మనిషి ఎక్కువసేపు బ్రతకడం సాధ్యం కాదు. ఇక్కడి నుండి ఒక మృతదేహాన్ని కిందకు తీసుకురావాలంటే 8 నుండి 12 మంది నిపుణులైన షెర్పాలు ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది.

రెస్క్యూ ఆపరేషన్‌కు దాదాపు 75,000 డాలర్లు (మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 71 లక్షలు) ఖర్చవుతుంది. తీవ్రమైన చలి, మంచు తుఫానులు, ఆక్సిజన్ లేకపోవడం వల్ల వేరొకరి ప్రాణాలను ప్రమాదంలో పడేయడం ఇష్టం లేకనే చాలా మంది పర్వతారోహకుల కుటుంబాలు మృతదేహాలను అక్కడే వదిలేస్తుంటారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe