Himayat Sagar Gates Lifted : హైదరాబాద్ నగరవాసులకు కీలక అలర్ట్. జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ రిజర్వాయర్ గేట్లను అధికారులు ఎత్తారు. గత కొన్ని రోజులుగా క్యాచ్మెంట్ ప్రాంతంలో (ఎగువన) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…. వాతావరణ శాఖ ఇచ్చిన తాజా అంచనాల నేపథ్యంలో జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లోలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని అదుపులో ఉంచేందుకు జలమండలి అధికారులు ఆదివారం (28.06.2026) సాయంత్రం 6:00 గంటలకు ఫ్లడ్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు.
మూసీలోకి నీటి విడుదల….

ప్రస్తుతానికి ముందస్తు జాగ్రత్తగా…. ప్రారంభ దశలో భాగంగా గరిష్టంగా 1,000 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. జలాశయానికి వస్తున్న వరద ఉధృతిని, ఇన్ఫ్లోలను నిమిష నిమిషానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జలమండలి అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వచ్చే వరద తీవ్రతను బట్టి, అవసరమైతే మరికొన్ని గేట్లను ఎత్తడం లేదా నీటి విడుదల పరిమాణాన్ని పెంచడం వంటి మార్పులు చేస్తామని స్పష్టం చేశారు.
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో జలమండలి ఎండి (MD) అశోక్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
- జలమండలి క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.
- నగరంలో విపత్తు నిర్వహణ చూస్తున్న హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC) బృందాలను రంగంలోకి దించారు.
- మూసీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసేందుకు పోలీసు శాఖతో కలిసి సమన్వయ చర్యలు చేపట్టారు.
- నది పరివాహక ప్రాంతాల్లోని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.