TG Ration Card eKYC : రేషన్ కార్డు ఈ-కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి..? మీ వద్ద ఉండాల్సిన పత్రాలివే
Telangana Ration Card eKYC : తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందే లబ్ధిదారులు ఆగస్టు 31 నాటికి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. రేషన్ షాపులు, మీసేవా కేంద్రాల్లో ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
Telangana Ration Card eKYC : రాష్ట్రంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరూ తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడంతో పాటు, అనర్హులను తొలగించి కేవలం నిజమైన లబ్ధిదారులకు, అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది.

ఆగస్ట్ 31 వరకు గడువు…
ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం… ఆగస్టు 31వ తేదీ నాటికి రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న కుటుంబ సభ్యులందరూ తమ ఈ-కేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ-కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి….?
- రేషన్ లబ్ధిదారులు రేషన్ దుకాణానికి వెళ్లొచ్చు. అక్కడ ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేయడం ద్వారా లేదా ఐరిస్ స్కాన్ విధానం ద్వారా తమ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు.
- ఒకవేళ రేషన్ దుకాణాల్లో వీలుకాని పక్షంలో… సమీపంలోని మీసేవా కేంద్రాలకు వెళ్లి కూడా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.
- రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేసేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు.
వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలు ఇవే..!
ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడానికి వెళ్లే సమయంలో లబ్ధిదారులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు, కార్డ్ లో పేరు ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులోని వివరాలతో ఈ-పోస్ యంత్రంలోని డేటాను అనుసంధానించి ఈ-కేవైసీని నిర్ధారిస్తారు. కాబట్టి ఆగస్టు 31 గడువు ముగిసేలోపే రేషన్ కార్డుదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవటం ఎలా..?
లబ్ధిదారులు తమ ఈ-కేవైసీ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. స్మార్ట్ఫోన్ ద్వారానే సులభంగా స్టేటస్ పరిశీలించుకోవచ్చు.
- ముందుగా https://smartpds.telangana.gov.in/ అధికారిక లింక్పై క్లిక్ చేయాలి.
- పోర్టల్ హోం పేజీ ఓపెన్ అయిన తర్వాత… అందులో కనిపించే Beneficiary Details పై నొక్కాలి.
- ఇక్కడ ఓపెన్ అయ్యే విండోలో మీ రేషన్ కార్డు నెంబర్ తో పాటు క్యాప్చాను నమోదు చేయాలి.
- ఇక్కడ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో పాటు ఈకేవైసీ స్టేటస్ వివరాలు కూడా కనిపిస్తాయి.
- స్టేటస్ యాక్టివ్, వెరిఫైడ్ అని ఉంటే ఈకేవైసీ పూర్తి అయినట్లు భావించాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

