...
...
Next Story

మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్, వీడియోలు వాడితే కఠిన చర్యలు.. కోర్టు సీరియస్ వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం చిరంజీవి పేరు, ఫొటోలు, వాయిస్, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించకూడదు. ఉపయోగిస్తే చర్యలు ఉంటాయి.

Updated on: Oct 25, 2025, 17:54:42 IST
Advertisement

మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత హక్కులకు అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్(మధ్యంతర ఉత్తర్వులు)ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మంజూరు చేసింది. ఈ ఆర్డర్స్ ఆధారంగా పిటిషన్‌లో పేర్కొన్న పేరు పొందిన పలువురితోపాటుగా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘన చేసే విధంగా పేరు, ఫొటోలు, వాయిస్ తదితరవాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది.

చిరంజీవి
చిరంజీవి

తన పేరు, చిత్రాల పేర్లు అనుమతి లేకుండా వాడటం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వేదికలపై ఉపయోగించడం, ఏఐ ద్వారా మార్ఫ్ చేసిన చిత్రాలు, వీడియోలను ప్రచారం కోసం వాడుకోవడంపై నిషేధం విధించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. చలన చిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్న చిరంజీవి పేరు, చిత్రాలు, వీడియో మీమ్స్.. అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని, ప్రతివాదులు చేసిన ఉల్లంఘనలు ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలిగిస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

చిరంజీవి తరఫున న్యాయవాది చెప్పిన విషయాలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. డిజిటల్, ఏఐ వేదికల ద్వారా వాణిజ్యపు దోపిడి, తప్పుడు చిత్రాలతో అపరిమిత నష్టం సంభవించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు ప్రకారం.. చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ అంటే మెగాస్టార్, చిరు, అన్నయ్యలాంటివి ఉపయోగించకూడదు. చిరంజీవి స్వరం, చిత్రం లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలో, ఏ మాధ్యమంలోనూ.. వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం నేరుగా గానీ, పరోక్షంగా గానీ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఉత్తర్వులు అమలులో ఉన్న కాలంలో ఎవరైనా వ్యక్తి, సంస్థ ద్వారా చిరంజీవిపై జరిగే ట్రోలింగ్, మార్ఫింగ్, అభ్యంతరకర కంటెంట్ ప్రచారం, అనుమతి లేని వాణిజ్య వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదులందరికీ తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe