ఫోన్ ట్యాపింగ్ కేసు : 'అవసరమైతే మళ్లీ పిలుస్తాం' - కేటీఆర్ విచారణపై 'సిట్' చీఫ్ కీలక ప్రకటన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను సిట్ విచారించింది. దాదాపు 7 గంటలకుపైగా ప్రశ్నించింది. గందరగోళానికి గురి చేసేలా కొన్ని వార్తలు బయటికి వచ్చిన నేపథ్యంలో సిట్ చీఫ్ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

Published on: Jan 24, 2026 9:54 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుని విచారించగా… శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ను కూడా విచారించింది. దాదాపుగా 7 గంటలకుపైగా ప్రశ్నించింది. అయితే కేటీఆర్ విచారణ వేళ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తున్నట్లు వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. ఈ వార్తలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

కేటీఆర్ సిట్ విచారణ - ప్రకటన
కేటీఆర్ సిట్ విచారణ - ప్రకటన

సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటన

మరోవైపు కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సిట్ నోటీసులకు అనుగుణంగా కేటీఆర్ విచారణకు హాజరయ్యారని తెలిపారు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారించామని స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని వివరాలను తన ప్రకటనలో పేర్కొన్నారు.

"పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు నోటీసు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం, 2026 జనవరి 23న ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆయనను ఆదేశించడం జరిగింది.

నోటీసుకు అనుగుణంగా కేటీఆర్ సిట్ /దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను విచారించడం జరిగింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో వాటిని విశ్లేషిస్తున్నాము. సాక్షులను ఎవరినీ సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆయనకు సూచించాము. అలాగే… అవసరమైతే విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని తెలియజేశాము.

ఈరోజు కేటీఆర్ విచారణ కేవలం క్రైమ్ నంబర్ 243/2024కి సంబంధించి మాత్రమే జరిగిందని స్పష్టం చేస్తున్నాము. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు మరియు ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ఇంటర్‌సెప్షన్ (ట్యాపింగ్), నిఘా పెట్టారనే విస్తృత ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది.

ఫోన్ ఇంటర్‌సెప్షన్ కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే జరిగిందని, ఇందులో ఎలాంటి చట్టవ్యతిరేకత లేదని కొన్ని మీడియా వర్గాలు మరియు వ్యక్తులు నిరాధారమైన, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు సంస్థకు ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం లేదు. ఈ దర్యాప్తు పూర్తిగా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా మరియు వృత్తిపరమైన ప్రమాణాలతో జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ధృవీకరించని లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలను కోరుతున్నాము. చట్టబద్ధమైన, అధికారిక మార్గాల ద్వారా వెల్లడించిన వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము" అని సిట్ చీఫ్ సజ్జనార్ సూచించారు.