రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం టీ ఎన్ జీ వో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. TNGO ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతంలో కొంత భూమిని కేటాయించింది. 2007 వేసిన HMDA లే ఔట్ లో 10 ఎకరాల ముసాయికుంటగా పేర్కొన్నారు. ఆ పక్కనే 4 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా గా ప్రకటించారు. అలాగే 2 ఎకరాలు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు.

ఇలా కేటాయింపులు జరగగా….ఈ భూమి ఆక్రమణలకు గురి అవుతోందని ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. GHMC, రెవెన్యూ విభాగాలతో కలసి క్షేత్ర స్థాయిలో విచారించింది. ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కొంతమంది ఈ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.
16 ఎకరాలకు ఫెన్సింగ్…
ఈ ఫిర్యాదులను హైడ్రా క్షుణ్ణంగా పరిశీలించింది. ఆక్రమణలను నిర్ధారించుకుని మొత్తం 16 ఎకరాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. 10 ఎకరాల ముసాయికుంటతో పాటు గ్రీన్ బెల్ట్ ఏరియాకు కేటాయించిన 4 ఎకరాలను కాపాడినందుకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారని హైడ్రా ఓ ప్రకటన ద్వారా తెలిపింది.