Telangana Education : విద్యా వ్యవస్థలో భారీ మార్పులు - స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్ విలీనం…?

Telangana Education Reforms : తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డ్రాపౌట్లను తగ్గించి…. గ్రామీణ విద్యార్థులకు 12వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

Published on: May 8, 2026, 12:51:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Education Reforms : తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. దశాబ్దాలుగా ప్రత్యేకంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ బోర్డు ఉనికిని రద్దు చేసి…….. దానిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి….. విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికకు ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

విద్యా వ్యవస్థలో మార్పులు...!
విద్యా వ్యవస్థలో మార్పులు...!

అడ్మిషన్ల షెడ్యూల్ రద్దు….

వాస్తవానికి రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఇటీవలనే షెడ్యూల్ విడుదల చేసింది. మే 8 నుంచి దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఓవైపు ఇంటర్ బోర్డు విలీన ప్రక్రియపై జరుగుతున్న అంతర్గత చర్చలు, పాలనాపరమైన మార్పుల వల్లే అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఈ కొత్త విధానంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

1969-70 కాలంలో కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు…. దేశంలో ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే….. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం ఏడు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, కేరళ, మణిపూర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్) మాత్రమే 10వ తరగతికి, 12వ తరగతికి వేర్వేరు బోర్డులు ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్దేశ్యమేంటి..?

ఈ విలీనం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం విద్యార్థుల డ్రాపౌట్లను తగ్గించడం. తెలంగాణలో 26,000 కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్య కేవలం 436 మాత్రమే. ఈ భారీ వ్యత్యాసం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

రవాణా సౌకర్యాలు లేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత చదువులకు దూరం కావడంతో చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయని విద్యా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.

జాతీయ విద్యా విధానం (NEP) స్ఫూర్తితో 12వ తరగతి వరకు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికే గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 12వ తరగతి వరకు ఒకే విద్యా సంస్థలో బోధిస్తున్నారు. ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే…. పలు మార్పులు వస్తాయి.

  • ఒకే క్యాంపస్‌లో 12వ తరగతి వరకు చదువుకోవచ్చు.
  • స్కూళ్లలోని లైబ్రరీలు, ల్యాబ్స్ సౌకర్యాలను ఇంటర్ విద్యార్థులు కూడా వాడుకోవచ్చు.
  • గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది.

ప్రస్తుతం ఇంటర్ బోర్డు కేవలం పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలకే పరిమితమైందని… ఆ పనులను ఎస్ఎస్‌సీ (SSC) బోర్డుతో కలిపి నిర్వహించడం సులభమని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ కొత్త ముసాయిదాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనిపై ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More