IRCTC Ooty Tour : జూన్ 9న తెలంగాణ, ఏపీ నుంచి ఐఆర్సీటీసీ ఊటీ, కూనూర్ టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలు!
ఐఆర్సీటీసీ జూన్ 9న హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 6 రోజుల ఈ ప్యాకేజీ ధరలు, పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.
ఎండల తీవ్రతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు సరికొత్త ఊరట లభించనుంది. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో, చల్లని కొండల మధ్య సేదతీరాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ (ULTIMATE OOTY EX HYDERABAD - SHR094 పేరుతో సాగే ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ 2026 జూన్ 9వ తేదీన ఉంది. తెలంగాణ నుంచి మాత్రమే కాదు.. ఏపీ నుంచి వెళ్లాలనుకునేవారు కూడా ఈ టూర్ బుక్ చేసుకోవచ్చు.

ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్ల పాటు సాగుతుంది. గుంటూరు జంక్షన్, హైదరాబాద్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ల నుంచి టూర్ ఉంది. రైలు ప్రయాణం, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, స్థానిక సందర్శన అన్నీ ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి.
మొదటి రోజు (జూన్ 9, మంగళవారం)
మధ్యాహ్నం 02:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగుతుంది. పర్యాటకులు తమ వీలును బట్టి నల్గొండ, గుంటూరు, తెనాలి స్టేషన్లలో కూడా ఈ రైలు ఎక్కవచ్చు. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు
ఉదయం 09:10 గంటలకు తమిళనాడులోని కోయంబత్తూరు రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ ఐఆర్సీటీసీ ప్రతినిధులు మిమ్మల్ని స్వాగతించి, ప్రత్యేక ఏసీ వాహనంలో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి తీసుకెళ్తారు. హోటల్లో చెక్-ఇన్ అయి కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం.. సాయంత్రం ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్స్, ఆహ్లాదకరమైన ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. రాత్రికి ఊటీలోనే బస.
మూడో రోజు
హోటల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయి సైట్సీయింగ్ ఉంటుంది. నీలగిరి కొండల్లోనే అత్యంత ఎత్తైన దొడబెట్ట పీక్, చాక్లెట్లు, టీ తయారీని చూపే టీ మ్యూజియం, అద్భుతమైన పైకారా జలపాతం సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోని హోటల్లోనే బస ఉంటుంది.
నాలుగో రోజు
ఉదయం అల్పాహారం ముగించుకుని, ఊటీకి సమీపంలో ఉండే మరో అందమైన హిల్ స్టేషన్ కూనూర్ కు బయలుదేరుతారు. అక్కడ టీ తోటలు, లోయల అందాలను వీక్షించిన అనంతరం తిరిగి సాయంత్రానికి ఊటీ చేరుకుంటారు. రాత్రికి ఊటీలోనే బస ఉంటుంది.
ఐదో రోజు
ఉదయం హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి చెక్-అవుట్ అవుతారు. అనంతరం ఊటీ నుంచి తిరిగి కోయంబత్తూరు రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. సాయంత్రం 03:40 గంటలకు తిరుగు ప్రయాణంలో శబరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.
ఆరో రోజు
ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో ఈ ఊటీ పర్యటన విజయవంతంగా ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరల వివరాలు
ఈ ప్యాకేజీ స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్), కంఫర్ట్ (3AC క్లాస్) అనే రెండు విభాగాలలో అందుబాటులో ఉంది. ప్రయాణికుల సంఖ్యను బట్టి ధరలు మారుతుంటాయి: కంఫర్ట్ (3ఏ) సింగిల్ షేరింగ్ (ఒక్కరే ఉంటే) రూ.33590, ట్విన్ షేరింగ్ (ఇద్దరు ఉంటే) రూ. 18890, ట్రిపుల్ షేరింగ్ (ముగ్గురు ఉంటే) రూ.17170గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్ రూ.8840, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.6490గా ఉంది.
స్టాండర్డ్ అయితే సింగిల్ షేరింగ్ రూ.31050, ట్విన్ షేరింగ్ రూ.16360, ట్రిపుల్ షేరింగ్ రూ.14630, చైల్డ్ విత్ బెడ్ రూ.6300, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.3950గా ఐఆర్సీటీసీ ధరలను నిర్ణయించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


