తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్.. మే నెలలోనే పోలింగ్!

Telangana MPTC and ZPTC Elections : తెలంగాణలో మరోసారి ఎలక్షన్ హీట్ మెుదలుకానుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

Published on: Apr 18, 2026, 12:00:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా మోగడానికి సమయం ఆసన్నమైంది. గత కొంతకాలంగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల, జిల్లా పరిషత్‌లకు తిరిగి ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

తెలంగాణ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
తెలంగాణ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

ఓటర్ల జాబితాపై క్లారిటీ.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

కొత్త ఓటర్ల చేరిక: 10.07.2025 నుండి 05.02.2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితా ఆధారంగా అదనపు ఓటర్లను గుర్తించనున్నారు.

గడువు: ఓటర్ల డేటాలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు నివేదించాలని హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

తుది జాబితా: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాను విడుదల చేసి, పోలింగ్ కేంద్రాలను ఖరారు చేస్తారు.

అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలి. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జడ్పీటీసీల పరిధిలోని గ్రామపంచాయతీలు, పోలింగ్‌ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందిస్తారు. ఈ లిస్టులను జిల్లా పంచాయతీ అధికారి కన్ఫామ్ చేసిన తర్వాత.. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం.. పోలింగ్ కేంద్రాలకు అనుసంధానిస్తారు.

మారిన స్థానిక లెక్కలు

గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వల్ల ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల సంఖ్యలో మార్పులు చోటు చేసుకున్నాయి.

మొత్తం జడ్పీటీసీలు: 566 (4 స్థానాలు తగ్గాయి)

మొత్తం ఎంపీటీసీలు: 5,773 (44 స్థానాలు తగ్గాయి)

మొత్తం జిల్లా పరిషత్‌లు: 31 (మేడ్చల్-మల్కాజిగిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో జాబితా నుండి తొలగించారు).

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు చివరిసారిగా 2019 మే 6, 10, 14వ తేదీల్లో ఎన్నికలు జరిగాయి. జూన్‌లో ఎంపీపీ, జడ్పీ ఛైర్‌పర్సన్లను ఎన్నుకున్నారు. కిందటి ఏడాది జూన్‌తో పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఇందుకోసం గత సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంపై ఎలక్షన్లు ఆగిపోయాయి. గత సెప్టెంబర్‌లోనే ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటికీ, బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కారణంగా అక్టోబర్‌లో హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు రిజర్వేషన్ల విధానంపై స్పష్టత రావడంతో కోర్టు అనుమతితో మే నెలలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ స్థానాల వారీగా జాబితాను సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి అందజేసింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More