మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ - అగ్రనేత దేవ్జీ లొంగుబాటు..! అదే బాటలో మరో కీలక నేత
మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ టాప్ కమాండర్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి సరెండర్ అయ్యారు.కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్లు సమాచారం.
ఆపరేషన్ కగార్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16మందితో కలిసి ఆయన ముందు లొంగిపోయినట్లు సమాచారం. రేపోమాపో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ టార్గెట్ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు ప్రాణాలు కోల్పోగా… మరికొంత మంది పలు రాష్ట్రాల్లో లొంగిపోయారు. ఇందులో భాగంగానే దేవ్ జీ, రాజిరెడ్డి కూడా లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అయితే వీరి లొంగుబాటుకు సంబంధించి పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
హిడ్మాతో సహా సీనియర్ మావోయిస్టులు ఏపీ ఎన్కౌంటర్లలో మరణించిన తర్వాత సీపీఐ (మావోయిస్ట్) చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ ఉన్నారనే దానిపై చాలా రోజులుగా ఊహాగానాలు తీవ్రమయ్యాయి. హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత…. దేవ్ జీ ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. తిరుపతి కుటుంబ సభ్యులు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే దేవ్ జీ తమ ఆధీనంలో లేరని ఏపీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు.
తిరుపతి అలియాస్ దేవ్ జీ ఎవరు…?
- పోలీసు రికార్డుల ప్రకారం…. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందినవాడు.
- 1983లో డిగ్రీని అభ్యసిస్తున్నప్పుడు తిరుపతి… రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ABVP మరియు RSU విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు సాధారణం. ఈ సమయంలో జరిగిన పలు ఘటనలు అనేక కేసులకు దారి తీశాయి.
- 1983 చివరిలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కేడర్ సభ్యుడి నుంచి అంచలంచెలుగు క్రమంగా ఎదిగిన అతను చివరికి కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. మావోయిస్టు పార్టీ యొక్క పొలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా ఉన్నారు.
- 2009 లో కేంద్ర కమిటీ సమావేశంలో భాగమైన తిరుపతి… అక్కడ కొత్తగా నియామకాలకు సైనిక శిక్షణా కేంద్రమైన బునియాడి కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాడు. మావోయిస్టు పార్టీ దాడులలో వ్యూహకర్తగా పేరొందాడు.
- 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటనకు తిరుపతి సూత్రధారి అని రికార్డులు చెబుతున్నాయి. ఆయన తలపై రూ.కోటి రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్జిఎ) యొక్క మొదటి సాయుధ ప్లాటూన్ ను సృష్టించిన ఘనత కూడా ఆయనకు దక్కింది.
- 2007 లో దంతెవాడలోని గీడం పోలీస్ స్టేషన్ పై జరిగిన దాడిలో కూడా తిరుపతి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
- దక్షిణ ఛత్తీస్ ఘడ్ తో పాటు ముఖ్యంగా బస్తర్, దంతెవాడలో అత్యంత ప్రభావం చూపే వ్యక్తిగా, వ్యూహకర్తగా భద్రతా సంస్థల రికార్డులు చెబుతున్నాయి.
- ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త నియామకాలు మాత్రమే కాకుండా సైనిక శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో కూడా తిరుపతి కీలక పాత్ర పోషించినట్లు భద్రతా సంస్థలు రికార్డులు సూచిస్తున్నాయి.
ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన స్థావరాలను మారుస్తున్నట్లు పోలీసులు చాలా రోజులుగా అనుమానిస్తున్నారు. ఇటీవలే కాలంలో ఆయన ఛత్తీస్ ఘడ్, తెలంగాణ కేంద్రంగా మక్కాం ఏర్పాటు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆపరేషన్ కగార్ 2లో భాగంగా…. భద్రతాల బలగాలు మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అడవిలోని పరిస్థితుల దృష్ట్యా… ఆయన ఆయుధం వదలి ప్రజాక్షేత్రంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

