మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు - వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు…!
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ది పనులు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి. గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా ప్రతినిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో చేస్తున్నారు.
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రతినిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా పనులు చేపట్టారు.
కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్న మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేడారానికి వచ్చే ప్రధాన రహదారిలో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జనవరి 3వ తేదీలోపే పూర్తి చేసే దిశగా కార్యాచరణను సిద్ధం చేశారు.
గద్దెల వద్ద కెపాసిటీ పెంపు…
భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని గద్దెల వద్ద కెపాసిటీ 3 వేల నుంచి 10వేల వరకు పెంచుతున్నారు. జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ, జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జాతర ప్రారంభం నాటికి నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తి చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. శుక్రవారం పలువురు మంత్రులతో కలిసి పర్యటించిన ఆయన… పనుల పురోగతిపై సమీక్షించారు.
వేగంగా పనులు - దేవాదాయశాఖ మంత్రి సురేఖ
“భక్తుల రద్దీ,ఆదివాసీ సంప్రదాయాలు మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో గద్దెల నిర్మాణం,జంపన్న వాగు స్నానాల సదుపాయాలు,రోడ్ల విస్తరణ, పార్కింగ్,డ్రైనేజీ వంటి కీలక పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. శాశ్వత సదుపాయాలతో మేడారాన్ని అభివృద్ధి చేసి,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం చెప్పారు.
మేడారం జాతర ఎప్పుడంటే…?
మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర తేదీలను ఈ ఏడాది జూలైలోనే ఖరారు చేశారు. 2026 జనవరి 28వ తేదీ బుధవారం సారలమ్మ రాకతో జాతర ప్రారంభమవుతుంది. 29న గురువారం సమ్మక్క దేవత గద్దెకు రావడం, 30న శుక్రవారం భక్తులు మొక్కులు సమర్పించుకోవడం, 31వ తేదీ దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

