మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు - 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా..!

మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి జరగబోయే జాతరకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది.

Published on: Jan 15, 2026, 08:19:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కోట్ల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో… ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చూస్తోంది. ఓవైపు అభివృద్ధి పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది.

మేడారం
మేడారం

మేడారం జాతర పనులను సీఎస్ రామకృష్ణారావు, ములుగు జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగబోతుందని తెలిపారు.

“ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు జాతరకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం. తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం. పండుగను సజావుగా విజయవంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి బాధ్యత తీసుకోవాలి. నిబద్ధతతో పని చేయాలని సూచిస్తున్నాం” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

మరుగుదొడ్ల సంఖ్యను పెంచడం, తగినంత తాగునీరు అందించడం, రవాణా సౌకర్యాలను బలోపేతం చేయడం, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. జాతర సంబంధిత సమాచారం కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ మరియు క్యూఆర్ కోడ్తో పాటు ప్రత్యేక లోగో మరియు వీడియోలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు.

ఈ జాతర కోసం 21 విభాగాలకు చెందిన 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బందితో పాటు 2,000 మంది గిరిజన యువ వాలంటీర్లను నియమించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

మరోవైపు ఈ జాతర కోసం ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని….. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భక్తుల రద్దీ అంచనాలకు మించి మరీ ఎక్కువగా ఉంటే… మరిన్ని బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

ఇక ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేస్తారు. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. ఇదే నిర్ణయం మేడారం ప్రత్యేక బస్సులకు వర్తించనుంది.

ఇక మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మాస్టర్ కంట్రోల్ రూమ్ తో పాటు హెల్ప్ డెస్క్ లు కూడా ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 08717 – 243055, 9491935321, 9493416719, 7382760241, 7382906844 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదింవచ్చని ములుగు జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More