తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం - పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్కాస్టింగ్ పర్యవేక్షణ ఉంచింది. పోలింగ్ ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.

ఈ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26.80 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.62 లక్షల మంది పురుష ఓటర్లు, ఇతరులలో 640 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. మొత్తంగా ఈ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత… ఓటింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తుంది.
మరోవైపు ఎన్నికల సంఘం రూపొందించిన టీ- పోల్(Tpoll) యాప్లోకి వెళ్లి ఓటర్ గుర్తింపు కార్డు(ఎపిక్) నంబరు సాయంతో స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓటర్ల సహాయం కోసం 92400 21456 నంబరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
- పోలింగ్, లెక్కింపు సజావుగా నిర్వహించడానికి వీలుగా 16,031 బ్యాలెట్ పెట్టెలు, 137 స్ట్రాంగ్ రూములు, 136 లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
- ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియలో ఇబ్బందులు వస్తే… ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. ఈ విషయంలో ఈసీదే తుది నిర్ణయం.
- ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఫిబ్రవరి 13వ తేదీన చేపడుతారు.
- ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు ఉంటాయి. గెలుపొందిన వార్డు సభ్యులు ఓట్లు వేసి ఎన్నుకోవాల్సి ఉంటుంది.
- ఫలితాల వెల్లడి తర్వాత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికైన వార్డు సభ్యులు ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.
- ఈ ఎన్నికల కోసం 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1900 సమస్యాత్మక, 1400 అత్యంత సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సీసీటీవీ మానిటరింగ్తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
- పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

