...
...
Next Story

NIMS Hyderabad : చిన్న పిల్లలకు హైదరాబాద్ నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు

NIMS Hyderabad : నిమ్స్‌లో పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయనున్నారు. అవసరం ఉన్నవారు ఆగస్టు 13వ తేదీ నుంచి నేరుగా నిమ్స్‌ను సంప్రదించవచ్చు.

Published on: Aug 10, 2026, 14:55:12 IST
Advertisement

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) తన వార్షిక సోషల్ హెల్త్ ప్రోగ్రామ్‌లో భాగంగా పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలను అందించనుంది.

నిమ్స్
నిమ్స్

గుండె శస్త్రచికిత్స అవసరమైన పిల్లలు 2026 ఆగస్టు 13 నుండి నేరుగా NIMSను సంప్రదించవచ్చు. స్క్రీనింగ్, వైద్యుల సంప్రదింపులు వాక్-ఇన్ పద్ధతిలో (ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే) జరుగుతాయి. వైద్యపరమైన అవసరాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తారు. వైద్య పరీక్షలు, అవసరమైన నిర్ధారణ పరీక్షల అనంతరం, శస్త్రచికిత్స అవసరమని తేలిన పిల్లలకు ఉచితంగా ఆ చికిత్సలు అందిస్తారు.

తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య NIMSలోని ఓల్డ్ బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న సిటి సర్జరీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. తమ వద్ద గత వైద్య రికార్డులు, పరీక్షా నివేదికలు ఉంటే వాటిని వెంట తీసుకురావాలని నిమ్స్ అధికారులు సూచించారు. వివరాల కోసం సిటి సర్జరీ కార్యాలయాన్ని 040-2348 9025 నంబర్‌లో సంప్రదించవచ్చు.

శస్త్రచికిత్స అవసరమైన పిల్లలకు ప్రత్యేక గుండె వైద్య సేవలను అందించేందుకు గత ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. కార్డియో-థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతి అమరేష్ రావు పర్యవేక్షణలో యూకేకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం, లండన్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ రమణ ధన్నపునేని సహకారంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.

పంజాగుట్టలోని నిమ్స్‌లోని సిటి సర్జరీ కార్యాలయాన్ని ఫోన్‌లో సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మీరు చిన్నారులను ఆసుపత్రికి తీసుకెళ్తే గతంలోని రిపోర్టులను కూడా వెంట తీసుకెళ్లండి. వైద్య పరీక్షలు, స్కానింగ్, చికిత్సలకు సంబంధించిన పాత రిపోర్టులు ఉంటే తీసుకెళ్లాలి. దీంతో వైద్యులు గత వైద్య చరిత్ర పరిశీలిస్తారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కూడా అంచనా వేస్తారు. డాక్టర్లు చిన్నారిని చూసిన తర్వాత.. ఆపరేషన్ అవసరం, అత్యవసరం, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ముందుకెళ్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe