...
...
Next Story

నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ముందు లిగల్ టీమ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్(బనకచర్ల) విస్తరణ పనులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో తెలంగాణ రిట్ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

Published on: Jan 4, 2026, 20:45:50 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు గురించి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో సోమవారం కీలకమైన విచారణ జరగనున్న నేపథ్యంలో చట్టపరమైన వాదనలను బలంగా వినిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు.

న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–నల్లమల సాగర్ విస్తరణ పనులను సవాలు చేస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించింది. నీటిపారుదల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సాంకేతిక, చట్టబద్ధమైన, పరిపాలనా ఉల్లంఘనలపై న్యాయ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని అధికారులను చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు విస్తరణను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ కోరింది. ఆంధ్రప్రదేశ్ తప్పనిసరి అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు అసలు ఆమోదించిన పరిధిని దాటి ముందుకు సాగుతోందని వాదించింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను రూపొందించడంపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలపై అధికారిక అభ్యంతరాలను విస్మరించారని తెలంగాణ పేర్కొంది.

గోదావరి బేసిన్‌లో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని పేర్కొంటూ.. సీడబ్ల్యూసీ, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డు జోక్యం చేసుకోవాలని తెలంగాణ కోరింది. విస్తరణకు పర్యావరణ అనుమతులపై స్టే ఇవ్వాలని, కేంద్ర ఆర్థిక సహాయాన్ని నిరోధించేలా ఆదేశించాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe