ఈ తీర్థయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారా? బడ్జెట్ ధరలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు!

బడ్జెట్ ధరలో తీర్థయాత్రలు చూసి రావాలి అనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ అనేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. అవి ఏంటో చూడండి.

Published on: Feb 19, 2026 5:50 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21వ తేదీ నుండి మే 21వ తేదీలలో 4 ప్రత్యేక ప్యాకేజీలను 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' ద్వారా హైదరాబాద్ నుండి అందిస్తున్నట్టుగా ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి.వెంకటేష్ తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు

దివ్యదక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ

తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరుకు ఈ యాత్రలో వెళ్లవచ్చు. మార్చి 21వ తేదీన ప్రారంభమై 28వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.14,700, 3ఏసీ ధర రూ.22,300, 2ఏసీ ధర రూ.28,700 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.

సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర

ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్) ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్ (సోమ్నాథ్), పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) ఈ టూర్‌లో కవర్ చేయవచ్చు. ఈ యాత్ర ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమై 24వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.17,600, 3ఏసీ ధర రూ.26,700, 2ఏసీ ధర రూ.34,600 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగావెళ్తుంది.

అయోధ్య-కాశీ యాత్ర

అయోధ్య-కాశీ యాత్ర బైద్యనాథ్ ధామ్‌ దర్శన్ యాత్ర.. పూరి - కోణార్క్ - బైద్యనాథ్ ధామ్ - వారణాసి - అయోధ్య – ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్తుంది. ఈ యాత్ర ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమై మే 5వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16,700, 3ఏసీ ధర రూ.26,100, 2ఏసీ ధర రూ.34,100 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగావెళ్తుంది.

హరిద్వార్‌-మాతావైష్ణోదేవి-రిషికేష్-యాత్ర

ఐఆర్‌సీటీసీ మధుర-బృందావనం-మాతా వైష్ణోదేవి-హరిద్వార్-రిషికేశ్ యాత్ర కూడా అందిస్తోంది. ఈ యాత్ర మే 12వ తేదీన ప్రారంభమై మే 21 వ తేదీ వరకు ఉండనుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16,500, 3ఏసీ ధర రూ.25,700, 2ఏసీ ధర రూ.33,400 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, పెద్దపల్లి , మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, నాగ్‌పూర్ మీదుగావెళ్తుంది

సౌకర్యాలు

రైలు, బస్సు, హోటల్, భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ప్రతి రైలులో 705 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకార్యాలు సమకురుస్తారని ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ చెప్పారు.

కోచ్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు పీవీ వెంకటేశ్. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030727, 9281030759లకు సంప్రదించాలి. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More