TG Registration Services : తెలంగాణలో 3 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్ - కారణం ఇదే..!

Telangana Registration Services : సర్వర్ నిర్వహణ పనుల వల్ల ఈ నెల 26 నుంచి 28 వరకు రిజిస్ట్రేషన్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. జూన్ 29 నుంచి సేవలు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

Published on: Jun 18, 2026, 19:02:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Registration Services : ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసే వారితో పాట రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజలకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. శాఖకు సంబంధించిన ప్రధాన వెబ్‌సైట్‌తో పాటు దానికి అనుబంధంగా పనిచేసే అన్ని ఆన్‌లైన్ సేవలు ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని వెల్లడించింది. సర్వర్ల ఆధునీకీకరణ, షెడ్యూల్ చేసిన సాంకేతిక నిర్వహణ పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రిజిస్ట్రేషన్లు బంద్
రిజిస్ట్రేషన్లు బంద్

సర్వర్ నిర్వహణ పనులు…

రిజిస్ట్రేషన్ల శాఖలో దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ స్థాయి సర్వర్ నిర్వహణ పనులను అధికారులు చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా శాఖకు సంబంధించిన ఆన్‌లైన్ సర్వర్ వ్యవస్థలు భవిష్యత్తులో మరింత సజావుగా, ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా పనిచేస్తాయి. అంతేకాకుండా వినియోగదారుల డేటా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం…. ప్రజలకు అందించే సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం ఈ తాత్కాలిక సాంకేతిక విరామం తప్పనిసరి అయిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు.

ఈ మూడు రోజుల విరామం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు కలగకుండా అధికారులు ఈ షెడ్యూల్‌ను రూపొందించారు. జూన్ 26వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉంది. అలాగే జూన్ 28వ తేదీన ఆదివారం రావడం వల్ల ఆ రోజు కూడా ప్రభుత్వ అధికారిక సెలవు దినమే అవుతుంది. ఈ రెండు సెలవుల మధ్యలో ఉన్న జూన్ 27వ తేదీన ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ పనిదినం (Working Day)గా ఉంటుంది. ఫలితంగా కేవలం ఒకే ఒక్క వర్కింగ్ డే రోజున మాత్రమే రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ మూడు రోజుల సమయాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు.

ఈనెల 29 నుంచి పునఃప్రారంభం

ఈ నేపథ్యంలో భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనుకునే ప్రజలు ఈ మూడు రోజుల విరామాన్ని గమనించాలని అధికారులు సూచించారు. తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను, స్లాట్ బుకింగ్స్‌ను ముందస్తుగానే ప్రణాళిక చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 29వ తేదీ సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ఎప్పటిలాగే యథావిధిగా పునఃప్రారంభమవుతాయి. శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఈ నిర్వహణ పనులకు ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు పూర్తిగా సహకరించాలని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More