Duddilla Sripadha Rao : ప్రజాసేవకు ప్రాణాలర్పించిన నాయకుడు శ్రీపాదరావు.. రాజకీయ ధ్రువతార

Duddilla Sripadha Rao : తెలుగు రాజకీయాల్లో దుద్దిళ్ల శ్రీపాదరావుది ప్రత్యేకమైన చరిత్ర. ఆయన వ్యక్తిత్వమే ప్రజలకు దగ్గర చేసింది. ఇప్పటికీ జనాల గుండెల్లో నిలిచేలా చేసింది. శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా ఓసారి స్మరించుకుందాం..

Updated on: Mar 1, 2026, 17:06:50 IST
By , Manthani
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాజకీయ చరిత్రలో కొంతమంది నాయకులు పదవుల వల్ల కాదు, తమ వ్యక్తిత్వం వల్ల గుర్తుండిపోతారు. అధికారపు మెరుపులు క్రమంగా మసకబారినా, వారు అందించిన విలువల వెలుగు మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది. తెలుగు నేలపై అలాంటి వెలుగులు పంచిన నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు. మార్చి 2, 1935న కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించిన ఆయన, ఒక సర్పంచ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి వరకు ఎదిగారు. ఆయన జీవితం మన రాజకీయ సంస్కృతికి చూపిన మార్గాన్ని శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా స్మరించుకోవాలి.

దుద్దిళ్ల శ్రీపాదరావు
దుద్దిళ్ల శ్రీపాదరావు

న్యాయవాదిగానూ సేవలు

ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీపాదరావు బాల్యమంతా పల్లెటూరులోనే గడిచింది. తల్లిదండ్రులు రాధాకృష్ణయ్య, కమలాబాయి ఇచ్చిన విలువలు ఆయన ప్రస్థానానికి పునాదిరాళ్లయ్యాయి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఆయన ధన్వాడలో ప్రాథమిక విద్య, మంథనిలో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ చేరారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు గ్రామ పరిపాలనపై స్పష్టమైన అవగాహన ఇచ్చింది. అనంతరం నాగ్‌పూర్‌లో న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా సేవలందించారు.

వ్యవసాయం చేస్తూ రాజకీయాల్లోకి

తండ్రి మరణం తర్వాత శ్రీపాదరావు తన స్వగ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేశారు. ఆ వ్యవసాయమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రైతు కష్టాలు, పల్లె ప్రజల ఆవేదనలు ఆయనకు ప్రత్యక్ష అనుభవాలయ్యాయి. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు పెద్ద వేదికలు అవసరం కాలేదు. ప్రజలే ఆయనను ముందుకు నెట్టారు. వరుసగా రెండు సార్లు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై, మహదేవపూర్ సమితి అధ్యక్షుడిగా, మంథని ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ దశలోనే ఆయన ప్రజానాయకుడిగా ఒక్కో మెట్టు పైకెదిగారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు దూరమయ్యే రాజకీయ సంస్కృతికి భిన్నంగా, ఆయన ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేవారు. నాయకత్వం అంటే హోదా కాదని, బాధ్యత అని ఆయన ప్రవర్తన చాటి చెప్పింది.

టీడీపీ హవాలోనూ విజయం

1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మధ్య కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నుంచి పోటీ చేసి విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ప్రజల విశ్వాసం ఆయనకు రాజకీయ బలంగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేశారు. రహదారులు, సాగునీటి సదుపాయాలు, విద్యా సంస్థలు, సంక్షేమ పథకాలు ఇలా ఆయన రాకతో... మంథని రూపురేఖలు మారిపోయాయి. 1990-94 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవం అని చెప్పవచ్చు.

అందరికీ మాట్లాడే అవకాశం

స్పీకర్ పదవి అంటే కేవలం సభను నడపడం కాదు. అది ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత. పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉన్న కాలంలో కూడా ఆయన నిష్పక్షపాత వైఖరి పాటించారు. పార్టీ భావజాలాన్ని పక్కన పెట్టి, సభను సమతుల్యంగా నడిపి, అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రశంసలను సమానంగా పొందారు. శ్రీపాదరావు స్పీకర్‌గా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుల క్రమశిక్షణ పెరిగింది. ప్రజలకు ఉపయోగపడే చర్చలన్నీ గౌరవప్రదంగా జరిగేలా చూశారు. సభాపతి పీఠం పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని నిలబెట్టారు. అదే సమయంలో తన నియోజకవర్గాన్ని మరువలేదు. మంథని అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

నక్సలైట్ల చేతిలో

1994 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ... ప్రజాసేవలో మాత్రం శ్రీపాదరావు వెనకడుగు వేయలేదు. నక్సలిజం ప్రభావం ఉన్న ప్రాంతంలోనూ ప్రజల మధ్యే ఉన్నారు. హింసకు బదులుగా ప్రజాస్వామ్య మార్గాన్ని విశ్వసించారు. 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో నక్సలైట్ల చేతిలో హత్యకు గురవడం యావత్ తెలుగు ప్రజలను కలచివేసింది. ప్రజల కోసం జీవించిన నాయకుడి జీవితం ఇలా బలవడం తెలంగాణ రాజకీయ చరిత్రలో విషాద ఘట్టంగా నిలిచిపోయింది.

అవే విలువలతో రాజకీయాల్లో శ్రీధర్ బాబు

శ్రీపాదరావు మరణంతో ముగిసింది కేవలం జీవితం మాత్రమే అని, ఆయన విలువలు కాదని మంథని ప్రజలు ఇప్పటికీ ఆయన మీద అభిమానాన్ని చాటుకుంటున్నారు. తండ్రి స్ఫూర్తిని ఆయన కుమారుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందుకు తీసుకెళ్తున్నారు. 1999 నుంచి వరుసగా ఐదుసార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విప్‌గా, మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజన చట్ట ప్రక్రియలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర అవిర్భావనికి కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖలను నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారు. తండ్రి అందించిన విలువలు, ప్రజల మధ్యే ఉంటూ చేసే రాజకీయం ఆయన నడకలో, నడతలో, పాలనలో ప్రతిబింబిస్తోంది.

శ్రీపాదరావు జయంతి వేడుకలు

దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు మార్చి 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని 2024 ఫిబ్రవరి 25న నిర్ణయించింది. ఇది ఆయన మీద ఉన్న గౌరవానికి నిదర్శనం. పార్టీలకు అతీతంగా అందరి గౌరవాన్ని పొందిన నాయకుడిగా ఆయన నిలిచారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న 89వ జయంతి కార్యక్రమంలో శ్రీపాదరావు స్మారక అవార్డులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అందజేస్తున్నారు.

భారత రక్షణ రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన డాక్టర్ జి. సతీష్ రెడ్డి , అన్నమయ్య కీర్తనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు , సాంకేతిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన ఆర్. వెంకటరామన్, సాంకేతిక, వృత్తిపర విద్యలో నూతన ఆవిష్కరణలకు మార్గదర్శకులైన డాక్టర్ సుబ్బరంగయ్య కొప్పరపు ఈ పురస్కారాలు అందుకోనన్నారు.

నేటి రాజకీయ వాతావరణంలో విభజన, విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న వేళ, శ్రీపాదరావు జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. అధికారాన్ని సంపాదించడం సులభమే కానీ, విశ్వాసాన్ని సంపాదించడం కష్టం. పదవి తాత్కాలికం. ప్రజల మనసుల్లో నిలిచే విశ్వాసమే శాశ్వతం అని శ్రీపాదరావు నిరూపించారు. సర్పంచ్ నుంచి శాసనసభ పీఠం వరకు ఆయన చేసిన ప్రయాణం, ప్రజాసేవకు అంకితమైన జీవితం ఒక నాయకుడు ఎలా ఉండాలో చూపించింది. ఆయనను స్మరించుకోవడం అంటే గతాన్ని పొగడడం మాత్రమే కాదు. రాజకీయాలకు విలువలు తిరిగి తీసుకురావాలనే సంకల్పం కూడా. దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా, ఆయన అందించిన రాజకీయ విలువలను స్మరించుకుంటూ యావత్ తెలంగాణ ఆయనకు నివాళి అర్పిస్తోంది!

జి.లక్ష్మీ
జి.లక్ష్మీ
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More