Telangana : ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళాలు - రైతు వేదికల్లో పంపిణీ! పూర్తి సమాచారం
Telangana Seed Mela 2026 : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 2,601 రైతు వేదికల్లో విత్తన మేళాలు జరగనున్నాయి. ఎల్నినో పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, సన్న రకాల వరి, నానో ఎరువులను ప్రభుత్వం ఒకే చోట అందుబాటులోకి తెచ్చింది.
రాష్ట్రంలోని అన్నదాతలకు సాగు ముంగిట తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాతావరణ మార్పులు, ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున విత్తన మేళాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది.

నేటి నుంచే పంపిణీ...
నేటి నుంచి నుండి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్రంలోని మొత్తం 2,601 రైతు వేదికల్లో ఈ విత్తన మేళాలను వైభవంగా నిర్వహించనున్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ఈ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది.
ఈ విత్తన మేళాల ద్వారా నాణ్యమైన, ధ్రువీకరించిన వివిధ రకాల పంటల విత్తనాలను ఒకే వేదికపై రైతులకు నేరుగా అందుబాటులో ఉంచుతారు. దళారీల బెడద లేకుండా, నకిలీ విత్తనాల బారిన పడకుండా రైతులు తమకు కావలసిన విత్తనాలను సరసమైన ధరలకే కొనుగోలు చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.
ఒకే వేదికపై విత్తనాలు, ఎరువులు - వివరాలు ఇలా..:
- రైతులకు ఎంతో డిమాండ్ ఉన్న పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్యాల విత్తనాలతో పాటు, ఆర్థికంగా మంచి లాభాలను ఇచ్చే నువ్వులు, వేరుశెనగ వంటి నూనెగింజల పంటల విత్తనాలను ఇక్కడ విక్రయిస్తారు.
- ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వివిధ రకాల చిరుధాన్యాలు (మిల్లెట్స్), అలాగే రైతులు రోజువారీ ఆదాయం పొందేందుకు వీలుగా నాణ్యమైన కూరగాయల విత్తనాలను సిద్ధం చేశారు.
- మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న వరి సన్నరకాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో బీపీటీ-5204, ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), జైశ్రీరామ్, కేఎన్ఎం-1638, కేఎన్ఎం-7715, డబ్ల్యూజీఎల్-44, హెచ్ఎంటీ సోనా వంటి ప్రముఖ ఏడు రకాల విత్తనాలు ఉన్నాయి.
- సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా భూసారాన్ని రక్షిస్తూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్నిచ్చే ఆధునిక ఎరువులైన నానో యూరియా, నానో డీఏపీ (DAP)లను కూడా ఈ మేళాల్లో ప్రదర్శనతో పాటు విక్రయానికి ఉంచుతున్నారు.
అవగాహన సదస్సులు...
కేవలం విత్తనాల అమ్మకాలే కాకుండా, ఈ మేళాల సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ సిబ్బంది, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా సమావేశం కానున్నారు. విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి విధానాలు, సమగ్ర పంట యాజమాన్యం, ఎరువుల సమతుల్య వినియోగం, పొదుపుగా నీటి యాజమాన్యం, పంటలను ఆశించే చీడపీడల నివారణ వంటి పలు కీలక అంశాలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల్లో తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే దానిపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలను అందించనున్నారు.
"నాణ్యమైన విత్తనమే అధిక దిగుబడికి పునాది అనే నినాదంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలోని రైతులందరూ ఈ విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి. రైతు వేదికల్లో లభించే ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేసి, శాస్త్రవేత్తలు సూచించిన ఆధునిక సాగు పద్ధతులను పాటించడం ద్వారా ఈ వానాకాలం సీజన్ లో అధిక దిగుబడులు సాధించాలి" అని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి ఆకాంక్షించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

