Southwest Monsoon 2026 : భీకరమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది వర్షాకాలాన్ని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాస్త ముందుగానే… అంటే ఈ మే నెలాఖరు నాటికే రుతుపవనాలు తెలంగాణను తాకుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు భారత దేశ దక్షిణ భాగాన్ని తాకే సూచనలున్నాయి. సాధారణంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది.
గతేడాది వాతావరణ గణాంకాలను పరిశీలిస్తే…. మే 24వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు, మే 31వ తేదీ నాటికి తెలంగాణను పలకరించాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో మే నెలాఖరుకల్లా రాష్ట్రంలో వర్షాగమనం మొదలయ్యేందుకు బలమైన సానుకూలతలు కనిపిస్తున్నాయి. ముందస్తు రాకపై రైతాంగంతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే…. ఈ వర్షాకాలంలో సాధారణం కన్నా కొంచెం తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే అంచనా వేసింది.
మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం పగటిపూట రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలో 44.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి భగభగలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు అల్లాడిపోతున్నాయి.
కొనసాగుతున్న అల్పపీడనం…
ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ(శనివారం) ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పగటి ఎండల నుంచి ఉపశమనం లభిస్తూ….. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.