న్యూఇయర్ ఎఫెక్ట్ : డిసెంబర్ 31వరకు ఎక్కడిక్కడ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు - ఒక్కరోజే 304 మంది పట్టివేత..!
న్యూ ఇయర్ సమీపిస్తున్న వేళ హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ వారం రోజుల పాటు ప్రత్యేకంగా తనిఖీలు చేయనున్నారు. బుధవారం ఒక్కరోజే 304 మంది పట్టుబడినట్లు సిటీ పోలీసులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని నియంత్రించే దిశగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బుధవారం నుంచి ప్రత్యేక 'డ్రంక్ అండ్ డ్రైవ్' సోదాలను ప్రారంభించారు.

304 మంది పట్టివేత…
డిసెంబరు 31 వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని నగర పోలీసులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. తొలి రోజైన బుధవారం(డిసెంబర్ 24) ఒక్కరోజే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 304 మంది పట్టుబడ్డారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి 304 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి బంజారాహిల్స్లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. స్వయంగా నగర సీపీ సజ్జనార్ ఈ తనిఖీలను పరిశీలించారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.
పట్టుబడితే జైలుకే - సీపీ సజ్జనార్
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు.
డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

